భారీ లాభాల నుండి నష్టాల్లోకి, చివరకు స్వల్ప లాభాల్లో ముగింపు
స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. గతవారం భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు, నేడు ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైనప్పటికీ, సాయంత్రానికి కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ వారాన్ని స్వల్ప లాభాలతో ప్రారంభించింది. వరుసగా ఆరు సెషన్ల పాటు నష్టాలను నమోదు చేసిన సూచీలు, ఇప్పుడు లాభాలబాట పట్టాయి. ఉదయం లాభాల వద్ద ప్రారంభమైన మార్కెట్లు, గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో మధ్యాహ్నం నష్టాల్లోకి జారుకున్నప్పటికీ, కాసేపటికి లాభాల్లోకి వచ్చాయి. కానీ ఉదయం లాభాలు హరించుకుపోయాయి.
అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నాయి. కానీ వరుస నష్టాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఆసియా మార్కెట్ల నుండి మాత్రం సానుకూల సంకేతాలు అందాయి. సెన్సెక్స్ ఉదయం 52,946.32 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,428.28 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,632.48 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 180 పాయింట్లు ఎగిసి 52,973 పాయింట్ల వద్ద, నిఫ్టీ 60 పాయింట్లు లాభపడి 15,842 పాయింట్ల వద్ద ముగిసింది.
క్యాపిడల్ గూడ్స్, ఆటో, రియాల్టీ, పవర్, పీఎస్యూ బ్యాంకింగ్, సూచీలు ఒక శాతం నుండి మూడు శాతం లాభపడ్డాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, మారుతీ సుజుకీ, హెచ్డీఎఫ్సీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో అల్ట్రా టెక్ సిమెంట్, ఏషియన్ పేయింట్స్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టీసీఎస్ ఉన్నాయి.