సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. కరోనా, లాక్ డౌన్ భయాలతో సోమవారం భారీ నష్టాలను నమోదుచేసిన మార్కెట్లు నేడు కాస్త రికవరీ అయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం వరకు కాస్త ఊగిసలాటగా కనిపించినప్పటికీ, చివరకు మంచి లాభాలు నమోదు చేశాయి. దేశంలో కరోనా వ్యాక్సీన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది. ఇప్పటికే వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలను అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇది సూచీలకు బలాన్నిచ్చాయి.
మార్కెట్ భారీ జంప్
సెన్సెక్స్ ఉదయం 47,991.53 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,627.43 వద్ద గరిష్టాన్ని, 47,775.32 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్లో 47,883 వద్ద ముగిసిన మార్కెట్లు, నేడు 600 పాయింట్లకు పైగా ఎగిసింది. 660.68 (1.38%) పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 48,544.06 పాయింట్ల వద్ద ముగిసింది. 14,364.90 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ 14,528.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,274.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 194.00 (1.36%) పాయింట్లు లాభపడి 14,504.80 పాయింట్ల వద్ద ముగిసింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 7.95 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 7.02 శాతం, టాటా మోటార్స్ 5.69 శాతం, బజాజ్ ఫైనాన్స్ 4.83 శాతం, మారుతీ సుజుకీ 4.53 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 4.40 శాతం, టీసీఎస్ 4.39 శాతం, టెక్ మహీంద్రా 3.65 శాతం, విప్రో 3.16 శాతం, HCL టెక్ 2.58 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి.
సూచీలు పాజిటివ్గా...
ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 200 పాయింట్లు లాభపడి, 48,120 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలడం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రయివేటురంగ బ్యాంకులు ICICI, HDFCల షేర్ల అండతో సూచీలు పాజిటివ్గా కదిలాయి. అయితే ఆశించిన దూకుడు కనిపించలేదు. కానీ మధ్యాహ్నం విదేశీ వ్యాక్సీన్ల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భారీగా లాభపడింది.