ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు నేడు (ఏప్రిల్ 22) నష్టాలలో ప్రారంభమయ్యాయి. క్రితం సేషన్లో 57,911 వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు ఆరంభంలోనే దాదాపు నాలుగు వందల పాయింట్లు నష్టపోయి 57,531 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఓ సమయంలో 670 పాయింట్లు క్షీణించి 57,245 పాయింట్లకు కూడా పడిపోయింది. తర్వాత కాస్త కోలుకున్నప్పటికి నష్టాలలోనే ట్రేడ్ అయింది.
సెన్సెక్స్ ఉదయం 57,531 పాయింట్ల వద్ద ప్రారంభమైనది. మధ్యాహ్నం గ.11.15 వరకు ఇదే గరిష్టం. 57, 244 పాయింట్ల వద్ద కనిష్టాన్ని అని తాకింది. ఈ వార్త రాసే సమయానికి సెన్సెక్స్ 315 పాయింట్లు నష్టపోయి 57,597 పాయింట్ల వద్ద, నిఫ్టీ 97 పాయింట్లు క్షీణించి 17,295 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జతీయ ప్రతికూల సంకేతాలతో మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. దీనికి తోడు గత రెండు రోజుల వరుస లాభాల నేపథ్యంలో కీలక రంగాల్లో లాభాలకు మొగ్గు చూపుతున్నారు. ప్రాఫిట్ బుకింగ్ కూడా సూచీల సెంటిమెంట్ ను దెబ్బ తీసింది. మరోవైపు అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీ రేట్లు వేగంగా పెంచనున్నట్లు ఫెడ్ చిఫ్ జెరోం పోవెల్ తెలిపారు. ఇవన్నీ మార్కెట్ సెంటిమెంట్ పైన ప్రభావం చూపాయి.