భారీ లాభాల్లో మార్కెట్లు, సెన్సెక్స్ 470 పాయింట్లు జంప్: రిలయన్స్, ఐసీఐసీఐ లిఫ్ట్...
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం(సెప్టెంబర్ 28) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. గతవారం సెన్సెక్స్ ఏకంగా 1,457.16 పాయింట్లు (3.83 శాతం) మేర క్షీణించింది. గురువారం ఒక్కరోజే సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగా నష్టపోగా, మరుసటి రోజు శుక్రవారం 800 పాయింట్లకు పైగా లాభపడింది. శుక్రవారం నాటి లాభాలు కొనసాగిస్తూ ఈరోజు సెన్సెక్స్ ఎగిసిపడింది.
ఉదయం గం.09:17 సమయానికి సెన్సెక్స్ 185.58 పాయింట్లు (0.50%) లాభపడి 37,574.24 వద్ద, నిఫ్టీ 61.20 పాయింట్లు (0.55%) లాభపడి 11,111.50 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత కాసేపటికే సెన్సెక్స్ 470 పాయింట్లకు పైగా లాభపడింది. ఉదయం 916 షేర్లు లాభాల్లో, 202 షేర్లు నష్టాల్లో, 53 షేర్లలో ఎలాంటి మార్పులేకుండా ప్రారంభమైంది. నిఫ్టీ 11,000 మార్క్ దాటింది. అన్ని రంగాలు కూడా లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
రాకేష్ ఝున్ఝున్వాలాకు భారీ షాక్: కుప్పకూలిన ఫేవరేట్ స్టాక్స్, రూ.కోట్ల సంపద హుష్కాకి!
లాభాలకు కారణాలు..
గతవారం అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రధానంగా అమెరికా స్టాక్స్ నాస్డాక్, ఎస్ అండ్ పీ 2 శాతానికి పైగా, 1 శాతానికి పైగా లాభపడింది. దీంతో ఈరోజు ఉదయం ఆసియా మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్ పైన కనిపించింది. జపాన్ నిక్కీ, తైవాన్ టీఎస్ఈసీ సూచీ, హ్యాంగ్షెంగ్ ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 0.12 శాతం నుండి 1.60 శాతం మేర లాభపడ్డాయి. కేవలం షాంఘై ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్ మాత్రం 0.22 శాతం మేర నష్టపోయింది. దేశీయంగా సెన్సెక్స్ 0.9 శాతం మేర లాభపడింది. కరోనా కేసుల రికవరీ పెరగడం, అమెరికా ప్యాకేజీపై క్లారిటీ ప్రభావం కూడా కనిపించింది.
ఐటీ స్టాక్స్ మిశ్రమం, లక్ష్మీవిలాస్ బ్యాంక్ డౌన్
- ఉదయం గం.10.45 సమయానికి సెన్సెక్స్ టాప్ గెయినర్స్ జాబితాలో ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, గెయిల్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఇన్ఫోసిస్, సిప్లా, టీసీఎస్ ఉన్నాయి.
- ఆటో, ఇన్ఫ్రా, మెడల్, ఫార్మా స్టాక్స్ మార్కెట్కు ఊతమిచ్చాయి.
- లక్ష్మీ విలాస్ బ్యాంకు షేర్లు ఓ సమయంలో 6 శాతం నష్టపోయాయి. ఆ తర్వాత కోలుకున్నాయి.
- అమెరికా డాలర్ మారకంతో రూపాయి 73.67 వద్ద ప్రారంభమైంది. శుక్రవారం 73.61 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు స్వల్పంగా నష్టపోయింది.
- ఐటీ స్టాక్స్ ఈ రోజు స్వల్పంగా నష్టాల్లో ఉన్నాయి. టీసీఎస్ 0.96 శాతం, ఇన్ఫోసిస్ షేర్ 1.09 శాతం, విప్రో 0.27 శాతం మేర నష్టపోయాయి. టెక్ మహీంద్రా 0.45 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.85 శాతం లాభపడ్డాయి.
మార్కెట్కు రిలయన్స్, ఐసీఐసీఐ లిఫ్ట్
ఐటీ షేర్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు తదితర షేర్లు మార్కెట్ను పైకి లేపాయి. ఉదయం గం.11 సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 1.30 శాతం మేర లాభపడింది. ఐసీఐసీఐ షేర్ ధర 2 శాతానికి పైగా లాభపడింది. హెచ్డీఎఫ్సీ షేర్ 1.45 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ 1.09 శాతం మేర లాభపడ్డాయి. ఫార్మా రంగ షేర్లు కూడా భారీ లాభాల్లో ఉన్నాయి. బయోకాన్ 2.34 శాతం, డాక్టర్ రెడ్డీస్ 0.32 శాతం మేర లాభపడ్డాయి.