నష్టాల్లో ప్రారంభమై.. లాభాల్లోకి మార్కెట్లు: ఒత్తిడిలో చమురు రంగం
ముంబై: దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 86.17 పాయింట్లు లేదా 0.27% నష్టపోయి 31,367.34 వద్ద, నిఫ్టీ 22.30 పాయింట్లు లేదా 0.24% నష్టపోయి 9,183.30 వద్ద ప్రారంభమైంది. 441 షేర్లు లాభాల్లో, 231 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 40 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఆ తర్వాత కాసేపటికో మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. ఉదయం గం.10.27 సమయానికి సెన్సెక్స్ 360 పాయింట్లు లాభపడింది.
చమురు రంగం మినహా మిగతా రంగాలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్, ఐసీఐసీఐ బ్యాంకు, హిండాల్కో, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఐటీసీ, బీపీసీఎల్, ఐవోసీ, భారతీ ఇన్ఫ్రాటెల్, యూపీఎల్ ఉన్నాయి.
మరింత దిద్దుబాటు మిగిలి ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే తయారీ రంగం దారుణంగా పడిపోయిందని, ఏప్రిల్ నెలలో లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ నెల కూడా మరింత బలహీనంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. కరోనా ఆంక్షలు కొనసాగుతున్నందున జూన్ త్రైమాసికం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలహీనమేనని, లాక్ డౌన్ కారణంగా దేశీయంగా కూడా జూన్ క్వార్టర్ పైన భారీ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
నిన్న మార్కెట్లు లాభాల్లో ప్రారంభమై నష్టాల్లో ముగిశాయి. మొన్న భారీ పతనం తర్వాత నిన్న కోలుకుంటుందని ఇన్వెస్టర్లు భావించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు చివరలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ ప్రభావం చూపింది. లాక్ డౌన్ పొడిగింపు, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఏడాది పట్టవచ్చుననే అంశం, అంతర్జాతీయ పరిమామాలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి. మంగళవారం డాలర్ మారకంతో రూపాయి 10 పైసలు బలపడి 75.63 వద్ద క్లోజైంది. ఆసియా మార్కెట్లలో హాంగ్కాంగ్ లాభాల్లో ముగిసింది.మిగతా ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు కాస్త పుంజుకున్నాయి. నిన్న సెన్సెక్స్ 262 పాయింట్లు, నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయింది.