వాహనదారులకు కీలక అప్డేట్.. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘిస్తే లైసెన్స్, RC రద్దు..కేంద్రం నుంచి త్వరలో కొత్త ప్లాన్
దేశవ్యాప్తంగా రహదారి భద్రతను పెంపొందించడం, వాహన చోదకుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే డ్రైవర్ల లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)ల నుండి పాయింట్లను తగ్గించే నూతన గ్రేడెడ్ పాయింట్ వ్యవస్థపై తమ మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
పదేపదే నిబంధనలను ఉల్లంఘించే వారి పత్రాలను సస్పెండ్ చేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) 66వ వార్షిక సమావేశం 2026లో పాల్గొన్న సందర్భంలో మంత్రి ఈ ప్రతిపాదిత సంస్కరణలను వివరించారు.
నూతనంగా రూపొందిస్తున్న చట్రం ప్రకారం.. ప్రతిసారి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సి నుండి నిర్ణీత పాయింట్లు కోతకు గురవుతాయి. పాయింట్లు ఒక నిర్దిష్ట పరిమితిని మించి తగ్గితే, ఆయా డ్రైవర్ల లైసెన్సులను సస్పెండ్ చేసేలా లేదా పూర్తిగా రద్దు చేసేలా అధికారులకు అధికారాలు కల్పిస్తారు. నిబంధనలను కచ్చితంగా పాటించే బాధ్యతాయుతమైన డ్రైవర్లకు ఇన్స్యూరెన్స్ ప్రీమియంలలో ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు లభిస్తాయని, క్రమం తప్పకుండా తప్పులు చేసే అలవాటు ఉన్న వాహనదారులకు తీవ్ర జరిమానాలు, శిక్షలు ఉంటాయని గడ్కరీ తెలిపారు.

రోడ్లపై డ్రైవర్ల ప్రవర్తన పెద్ద సమస్యగా మారిందని అభిప్రాయపడిన మంత్రి, చెడు అలవాట్లను సరిదిద్దేందుకు దేశవ్యాప్తంగా 1,600 డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 24 కేంద్రాలు అందుబాటులోకి రాగా, మరో 112 కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మందికి పైగా శిక్షణ పొందారని వివరించారు.
దీనికి తోడు, వాహన భద్రతను పెంచేందుకు అక్టోబర్ 2027 నుండి 'భారత్ NCAP 2.0' అమలు చేయనున్నట్లు ప్రకటించారు. పాత బీఎస్-IV (BS-IV) వాహనాల నుండి వెలువడే ఉద్గారాలను తగ్గించేందుకు రూ. 4,000 నుండి రూ. 5,000 వ్యయమయ్యే ప్రత్యేక పరికరాన్ని సిద్ధం చేశామని, దీని ట్రయల్స్ పూర్తయ్యాయని తెలిపారు. దీనివల్ల పాత వాహనాల ఉద్గారాలు బీఎస్-VI స్థాయికి తగ్గుతాయని స్పష్టం చేశారు.
భారతదేశంలో ఏటా దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిలో సుమారు 1.80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. మరణిస్తున్న వారిలో ఎక్కువగా 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత కావడం దేశానికి తీవ్ర నష్టమని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ప్రమాదాలను మరియు మరణాలను ఏది ఏమైనా అరికట్టడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications

