జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. UPI, పాన్ కార్డ్, గ్యాస్ సిలిండర్ ధరల్లో మారిన రూల్స్ ఇవే!
ఈ జూన్ నెల సామాన్యులతో పాటు ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, డిజిటల్ పేమెంట్స్ వాడేవారికి చాలా కీలకమైన మార్పులను మోసుకొచ్చింది. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 (Income Tax Act, 2025) కింద పన్ను నిబంధనల నుండి యూపీఐ లావాదేవీల వరకు ప్రభుత్వం పలు కొత్త నిబంధనలు (New Rules) అమల్లోకి తెచ్చింది. మరి ఈ నెలలో మారిన ఆ ముఖ్యమైన ఆర్థిక విషయాలేంటో ఓసారి చూద్దాం.

జూన్ 15 లోపు అడ్వాన్స్ టాక్స్ కట్టాల్సిందే!
ఆర్థిక సంవత్సరం 2026-27 కి గానూ అడ్వాన్స్ టాక్స్ చెల్లించడానికి జూన్ 15 చివరి తేదీగా నిర్ణయించారు. ఏడాదికి రూ. 10,000 కంటే ఎక్కువ పన్ను బాధ్యత ఉన్నవారు తమ టాక్స్లో 15 శాతాన్ని ఈ తేదీ లోపు చెల్లించాలి. కొత్త ఆదాయపు పన్ను రూల్స్ 2026 ప్రకారం జరుగుతున్న మొదటి అడ్వాన్స్ టాక్స్ సైకిల్ ఇది. ఒకవేళ డెడ్లైన్ దాటితే వడ్డీతో సహా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది.
హైదరాబాద్ వాసులకు హెచ్ఆర్ఏ (HRA) ఊరట!
సాలరీ తీసుకునే ఉద్యోగులకు ప్రభుత్వం కొన్ని పన్ను మినహాయింపులను పెంచింది. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ మినహాయింపును నెలకు రూ. 100 నుండి రూ. 3,000 కి, హాస్టల్ ఖర్చుల మినహాయింపును నెలకు రూ. 9,000 కి పెంచారు. అంతేకాదు, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్లతో పాటు మన హైదరాబాద్ నగరాన్ని కూడా 50% హెచ్ఆర్ఏ మినహాయింపు కేటగిరీలోకి చేర్చారు. దీనివల్ల ఇక్కడ అద్దె ఇళ్లలో ఉండే ఉద్యోగులకు భారీగా టాక్స్ సేవింగ్స్ అవుతాయి.
సేఫ్ యూపీఐ పేమెంట్స్.. పేరు చూసాకే మనీ ట్రాన్స్ఫర్!
డిజిటల్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఎన్పీసీఐ (NPCI) సరికొత్త అప్డేట్ తెచ్చింది. ఇకపై మీరు ఎవరికైనా క్యూఆర్ కోడ్ లేదా మొబైల్ నంబర్ ద్వారా డబ్బులు పంపేటప్పుడు.. అవతలి వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో ఉన్న అసలు పేరు (Verified Name) స్క్రీన్పై కనిపిస్తుంది. వారు పెట్టుకున్న నిక్ నేమ్స్ కాకుండా అఫీషియల్ పేరు కనిపించడం వల్ల తప్పుడు అకౌంట్లకు మనీ పంపే ఛాన్స్ ఉండదు. మరోవైపు ఈపీఎఫ్ఓ (EPFO) కూడా యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా చేసుకునే సదుపాయంపై పనిచేస్తోంది.
కమర్షియల్ గ్యాస్, సీఎన్జీ ధరల మంట!
నెలవారీ ధరల సమీక్షలో భాగంగా జూన్ 1 నుండి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరించాయి. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 42 పెరిగి రూ. 3,113.50 కి చేరింది. ముంబైలో సీఎన్జీ (CNG) ధర కిలోకు రూ. 2 పెరిగి రూ. 86 అయ్యింది. అయితే, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనాలపై ఎగుమతి సుంకాన్ని ప్రభుత్వం స్వల్పంగా తగ్గించింది.
ఇల్లు అమ్మకాలు.. పాన్ కార్డ్ రూల్స్ చేంజ్!
ఆస్తి లావాదేవీల్లో పాన్ కార్డ్ నిబంధనలను ప్రభుత్వం మార్చింది. ఆస్తి కొనుగోలు/అమ్మకాల సమయాల్లో పాన్ కార్డ్ తప్పనిసరి చేసే పరిమితిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచారు. అయితే, రూ. 45 లక్షలు దాటే ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్, జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్లకి పాన్ కార్డ్ కచ్చితంగా ఇవ్వాలి. అలాగే రూ. 50,000 పైన చేసే సాధారణ క్యాష్ డిపాజిట్లకు పాన్ నంబర్ కోట్ చేయడం ఇప్పుడు తప్పనిసరి కాదు. కానీ ఏడాదికి రూ. 10 లక్షలు దాటి చేసే విత్డ్రాలపై నిఘా కొనసాగుతుంది.
చిన్న మొత్తాల పొదుపు పథకాలైన పీపీఎఫ్ (7.1%), సుకన్య సమృద్ధి యోజన (8.2%) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. కాబట్టి ఈ కొత్త నిబంధనలు (New Rules) మన రోజువారీ బడ్జెట్ను ఎలా ప్రభావితం చేస్తాయో చూసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది!


Click it and Unblock the Notifications