ఒక్క మిస్డ్ కాల్తో కొత్త ఎల్పీజీ కనెక్షన్: ఐఓసీ ఛైర్మెన్
కరోనావైరస్ కారణంగా 2020లో దాదాపుగా అన్ని ఆర్థికపరమైన కార్యకలాపాలకు బ్రేక్ పడటంతో దేశం ఆర్థికంగా నష్టాల ఊబిలో కూరుకుపోయింది. కరోనావైరస్ కారణంగా దేశంలో లాక్డౌన్ విధించడంతో అన్ని ప్రముఖ రంగాలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఇక క్రమంగా లాక్డౌన్ ఎత్తివేయడంతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. అంటే దేశం తిరిగి ఆర్థికంగా పుంజుకుంటోందని చెప్పేందుకు డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలే అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. 2020వ సంవత్సరంలో వాహనాల కొనుగోలు 108శాతం అదే సమయంలో డీజిల్ ధరలు 96శాతం మేరా పెరిగిందని ఐఓసీ మార్కెటింగ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ తెలిపారు. ఆర్థిక పునర్నిర్మాణం జరుగుతోందని చెప్పేందుకు ఈ అంశాలే నిదర్శనమని చెప్పారు.
ఇక లాక్డౌన్ సమయంలో ఎల్పీజీ వంట గ్యాస్కు 10శాతం ఎక్కువగా డిమాండ్ ఏర్పడిందని ఇండియన్ ఆయిల్ ఛైర్మెన్ ఎస్ఎం వైద్యా చెప్పారు. 2020వ సంవత్సరం డిజిటలైజేషన్ సంవత్సరంగా గుర్తిస్తున్నట్లు చెప్పిన వైద్యా... ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల్లో మొత్తం డిజిటల్ పద్దతినే వినియోగించి లావాదేవీలు జరిపినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అస్సాంలోని అతి పురాతనమైన ఆయిల్ రిఫైనరీ నుంచి కోల్కతాతో కలుపుకుని ఏడు ప్రధాన నగరాలకు హై ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్ సరఫరాను ప్రారంభించారు.
ఇక కేవలం ఒక మిస్డ్కాల్తో ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు ధర్మేంద్రప్రధాన్. అంతేకాదు కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలంటే కూడా ఒక మిస్డ్కాల్ ద్వారానే చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతం మిస్డ్ కాల్ ద్వారా కొత్త కనెక్షన్ పొందే వెసులుబాటు ఒక్క భువనేశ్వర్లో మాత్రమే ఉంది. ఇక త్వరలోనే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఐఓసీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో 30 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. వీటిలో గత ఆరేళ్లలోనే 17 కోట్ల కొత్త కనెక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు.