నెట్ఫ్లిక్స్-సుబ్రతా రాయ్ వివాదం... సుప్రీంను ఆశ్రయించనున్న ఓటీటీ దిగ్గజం...
'బ్యాడ్ బాయ్స్ మిలియనీర్స్' ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న డాక్యుమెంటరీ వెబ్సిరీస్ ఇది. సెప్టెంబర్ 2 నుంచి నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానున్న ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా నలుగురు ప్రముఖ బిలియనీర్ల చుట్టూ తిరుగుతుంది. ఆ నలుగురు బిలియనీర్లు... విజయ్ మాల్యా,సుబ్రతా రాయ్,నీరవ్ మోదీ,సత్యం రామలింగరాజు. మనీ లాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న,ఎదుర్కొంటున్న ఈ నలుగురు ఎలా తమ తమ సామ్రాజ్యాలను నిర్మించుకోగలిగారన్నదే ఈ డాక్యుమెంటరీ సిరీస్ కాన్సెప్ట్.
అయితే ఈ సిరీస్లో తన పేరును వాడటంపై సహారా ఇండియా ఛైర్మన్ సుబ్రతా రాయ్ బీహార్లోని అరారియా కోర్టును ఆశ్రయించారు. దీంతో సుబ్రతా రాయ్ పేరును వాడవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నెట్ప్లిక్ బిహార్ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ను సోమవారం(అగస్టు 31) దాఖలు చేయనుంది. దీంతో సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందన్న ఆసక్తి నెలకొంది.
కాగా,లండన్కి చెందిన ఓ దర్శకుడు 2019లో తనను కలిశాడని సుబ్రతా రాయ్ ఆరోపించారు. తన జీవిత కథ ఆధారంగా వెబ్ ఫీచర్ తెరకెక్కిస్తానని అతను చెప్పాడని... టైటిల్ కూడా 'బిలియనీర్స్' అని తెలిపాడని చెప్పారు. రాయ్ తరుపు న్యాయవాది వివేక్ ఝా మాట్లాడుతూ... ఈ వెబ్ సిరీస్ ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నం అని ఆరోపించారు.
బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి ప్రస్తుతం పరారీలో ఉన్న వజ్రాల వ్యాపిర మెహుల్ చోక్సి కూడా ఈ వెబ్ సిరీస్పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్&ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కూడా చోక్సి పిటిషన్ను తప్పు పట్టింది. జాతీయ భద్రతకు విఘాతం కలిగించే అంశాలు ఉంటే తప్ప తాము కంటెంట్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.