ముఖేష్ అంబానీకి ఎదురెళ్లి..చేతులు కాల్చుకున్న అమెజాన్: రూ.200 కోట్ల పెనాల్టి
ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-ఫ్యూచర్ గ్రూప్ మధ్య కాంట్రాక్ట్ వ్యవహారంలో వేలు పెట్టిన ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్కు చుక్కెదురైంది. 24,713 కోట్ల రూపాయల ఈ మెగా డీల్కు వ్యతిరేకంగా పోరాడుతున్న అమెజాన్కు ఎదురుదెబ్బ తగిలింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తనకు 200 కోట్ల రూపాయల పెనాల్టీని విధించడాన్ని సవాల్ చేస్తూ నేషనల్ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించినప్పటికీ.. ఫలితం దక్కలేదు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వెంచర్లను విక్రయించడానికి ఇదివరకు సాగిన ప్రయత్నాలను అమెజాన్ చట్టపరంగా అడ్డుకోవడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ మెగా డీల్ విలువ 24,713 కోట్ల రూపాయలు. దీని పట్ల అమెజాన్ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు.
బిగ్ బజార్ను నిర్వహిస్తోన్న ఫ్యూచర్ రిటైల్ వెంచర్లో అమెజాన్కు పరోక్షంగా 10 శాతం వరకు పెట్టుబడులు ఉన్నాయి. పరోక్ష పెట్టుబడులను పెట్టే సమయంలో ఈ రెండు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందాలకు విరుద్ధంగా ఈ మెగా విలీనం ఉందనేది అమెజాన్ వాదన. అప్పట్లో ఫ్యూచర్-అమెజాన్ కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం.. కాల పరిమితి ముగిసే వరకు ఫ్యూచర్ రిటైల్ వెంచర్.. స్వతంత్రంగా కొనసాగాల్సి ఉంటుంది.

దీనికి విరుద్ధంగా ఫ్యూచర్ రిటైల్ వెంచర్ అధినేత కిశోర్ బియానీ.. రిలయన్స్తో విలీన ప్రతిపాదనలను తెర మీదికి తీసకుని రావడాన్ని అమెజాన్ తప్పు పట్టింది. అమెజాన్-ఫ్యూచర్ గ్రూప్ మధ్య కుదిరిన ఈ 10 శాతం ఒప్పందం చెల్లుబాటు కాదంటూ గత సంవత్సరం డిసెంబర్లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిపై అమెజాన్ సుదీర్ఘకాలం పాటు న్యాయపోరాటాన్ని సాగించింది. నేషనల్ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టులోనూ దీనిపై పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కాంపిటీషన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ లా అప్పిలేట్ ట్రిబ్యునల్లోనూ పిటీషన్ దాఖలు చేయగా.. అది కొట్టివేతకు గురైంది.
గతంలో సీసీఐ ఇచ్చిన ఆదేశాలను అప్పిలేట్ ట్రిబ్యునల్ సమర్థించింది. అమెజాన్ దాఖలు చేసిన పిటీషన్లను జస్టిస్ ఎం వేణుగోపాల్, జస్టిస్ అశోక్ కుమార్ మిశ్రాతో కూడిన ఎన్సీఎల్ఏటీ ధర్మాసనం తోసిపుచ్చింది. దీనితో పాటు జరిమానా సైతం చెల్లించాలని ఆదేశించింది. దీనికి గడువు కూడా విధించింది. 45 రోజుల్లోగా 200 కోట్ల రూపాయల మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాలని ఆదేశించింది.


Click it and Unblock the Notifications