Raghunandan Kamath: వ్యాపార చరిత్రలో కొత్త మైలురాళ్లను అధిరోహించి సక్సెస్ స్టోరీతో అనేక మందిని ఆకర్షించిన వ్యక్తి నేచురల్ ఐస్ క్రీమ్స్ వ్యవస్థాపకుడు రఘునందన్ కామత్. కామత్ తన 75వ ఏట మే 17న తుదిశ్వాస విడిచారు.
వాస్తవానికి ఆయన స్వల్ప అస్వస్తతతో మే 17న ఆసుపత్రిలో చేరారు. అయితే ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించినట్లు వెల్లడైంది. కంపెనీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో యజమాని రఘునందన్ కామత్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతిని ప్రకటించటంతో మరణం ధృవీకరించబడింది. రఘునందన్ మృతిపై కర్ణాటక బీజేపీ చీఫ్ కెప్టెన్ బ్రిజేంద్ర చౌటా ఒక అద్భుత ప్రయాణం ముగిసిందంటూ ట్వీట్ చేశారు. నేచురల్ ఐస్క్రీమ్ల వ్యవస్థాపకుడు & శక్తి అయిన 'ఐస్క్రీమ్ మ్యాన్' శ్రీ రఘునందన్ కామత్ మరణవార్త తెలిసి చాలా బాధగా ఉందని పేర్కొన్నారు.

ముల్కీ నుంచి ముంబై వరకు కేవలం ఒక కలతో ప్రతి ఐస్ క్రీం ప్రేమికుడికి 'సహజమైన' ఎంపికగా మారిన బ్రాండ్ను సృష్టించిన ఆయన జీవితం ప్రతి వ్యవస్థాపకుడికి గొప్ప పాఠం & ప్రేరణగా నిలుస్తుందని చౌటా పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
కామత్ సక్సెస్..
ఐస్ క్రీం పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన కామత్ కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు తాలూకాలోని ముల్కి అనే పట్టణంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తండ్రి పండ్ల వ్యాపారి కావటంతో చిన్నతనంలో సహాయం చేసేవాడు. అయితే 14 ఏళ్ల వయస్సులో గ్రామాన్ని విడిచి ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ముంబై నగరానికి చేరుకున్నాడు. తొలుత చిన్నపాటి ఉద్యోగాలు చేసినా 1984లో నలుగురు కార్మికులతో ఐస్ క్రీమ్ వ్యాపారంలోకి ప్రవేశించారు. మొదట్లో ఆయన కంపెనీ కేవలం 12 ఫ్లేవర్ల ఐస్ క్రీం మాత్రమే విక్రయించింది. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి, కామత్ తన ఐస్క్రీమ్తో పాటు పావ్ భాజీని అందించాడు. ఈ వ్యూహం చాలా మంది కస్టమర్లను ఆకర్షించింది.
నిజమైన పండ్లను ఐస్ క్రీమ్ తయారీలో వినియోగించటం ప్రజలను దేశవ్యాప్తంగా ఆకర్షించింది. దీంతో నేచురల్స్ ఐస్ క్రీమ్ ప్రజాదరణ పొందడంతో కామత్ పూర్తిగా ఐస్ క్రీం వ్యాపారంపై దృష్టి పెట్టాలని, తన ఉత్పత్తులను మెరుగుపరచాలని నిర్ణయించుకున్నాడు. నేచురల్స్ విలువ సుమారు రూ.400 కోట్లు, 2020 నాటికి భారతదేశం అంతటా 135 అవుట్లెట్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications