e-commerce policy: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి డిజిటల్, ఇ-కామర్స్ కంపెనీల నియంత్రణ కోసం జాతీయ ఇ-కామర్స్ విధానం రూపుదిద్దుకుంటోంది. ఇదికాస్తా చివరి దశలో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందువల్ల ఇకపై ముసాయిదా విధానాలు విడుదల చేయబడవని ఓ అధికారి వెల్లడించారు.
వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాతీయ ఇ-కామర్స్ విధానాన్ని తయారుచేస్తోంది. వాటాదారుల అభిప్రాయాలను సేకరించేందుకు గతంలో ముసాయిదా విధానాన్ని తీసుకొచ్చింది. ఆగస్టు 2న జరిగిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (DPIIT) సమావేశంలో ఓ ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ జాతీయ విధానం తుది ఆమోదం పెండింగ్ లో ఉందని, త్వరలో అనుమతి కోసం ప్రభుత్వానికి అందజేస్తామని.. ఈ వ్యవహారం గురించి పూర్తిగా తెలిసిన ఓ అధికారి తెలిపారు. డేటా స్థానికీకరణ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్ ప్లేస్, రెగ్యులేషన్స్, డిజిటల్ ఎకానమీ వృద్ధి, ఇ-కామర్స్ ఆధారిత ఎగుమతుల ప్రోత్సాహం ఇందులో ప్రధాన అజెండాగా వినికిడి.

గతంలో విడుదల చేసిన ముసాయిదా విధానంలో.. సున్నిత డేటా ప్రాసెసింగ్, నకిలీ ఉత్పత్తులు సహా అక్రమ కంటెంట్ను అరికట్టడం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలను పునఃపరిశీలించడం వంటివి ఉన్నాయి. ప్రతిపాదిత తుది విధానం.. ఇ-కామర్స్ ఎగుమతులు పెంచడం, స్టార్టప్స్ మరియు వినియోగదారుల సమస్యలపై దృష్టి సారించింది. ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం, సరఫరా గొలుసు క్రమబద్ధీకరణ దీని ప్రధాన లక్ష్యాలు.


Click it and Unblock the Notifications