మ్యూచువల్ ఫండ్స్ బ్యాంకు కాదు, పెట్టుబడిదారులపై ఒత్తిడి చేయట్లేదు: త్యాగి
మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు బ్యాంకులు కాదని, అవి బ్యాంకుల తరహాలో వ్యవహరించకూడదని సెబి చైర్మన్ అఝయ్ త్యాగి అన్నారు. కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇటీవలి కాలంలో బ్యాంకుల తరహాలో కస్టమర్లకు మారటోరియం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్ సంస్థల సంఘం సభ్యులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడికి, రుణానికి మధ్య తేడాను గుర్తించాలన్నారు.
కరోనా వైరస్ లాక్డౌన్, దారుణంగా పతనమైన బంగారం స్మగ్లింగ్
బ్యాంకులకు ఉన్నట్లు మ్యూచువల్ ఫండ్ సంస్థలకు నగదు నిల్వల నిష్పత్తి నిబంధనలు లేవని, రుణవితరణ బాధ్యతలు కూడా లేవన్నారు. ఇన్వెస్టర్ల విశ్వాసం పొందటం వాటి బాధ్యత అన్నారు. ఎక్కువమంది ఇన్వెస్టర్లు ప్రస్తుతం 50 నగరాల్లోనే ఉన్నారని, మ్యూచువల్ ఫండ్స్ మరింతగా విస్తరించాల్సి ఉందని చెప్పారు.
స్మాల్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని సెబి ఎవరిపై ఒత్తిడి చేయదని అజయ్ త్యాగి అన్నారు. ఇన్వెస్టర్లకు ప్రయోజనం కలిగేలా, నచ్చిన వాటిల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చునని, అది వాళ్లకు సంబంధించిన అంశం అన్నారు. ఇటీవల తెచ్చిన కొత్త నిబంధనలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.
మల్టీ క్యాప్ ఫండ్ పేరుతో వచ్చిన నిబంధనలో పెద్ద, మధ్య చిన్న తరహా కంపెనీల షేర్లలో 25 శాతం పెట్టుబడులు పెట్టాలని ఉందని, కానీ ఇంతకుముందు ఇలాంటి ఆంక్షలు లేకపోవడంతో పెద్ద కంపెనీల షేర్ల నుండి మధ్య తరహా, చిన్న కంపెనీల షేర్లలోకి రూ.30వేల కోట్ల నుండి రూ.40వేల కోట్ల మేర పెట్టుబడులు తరలిపోతాయని అంచనా వేస్తున్నారు.