ముంబై టు హైదరాబాద్ కేవలం 3 గంటల్లోనే! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ అండ్ స్టేషన్ల లిస్ట్ వచ్చేసింది!
మన దేశంలో బుల్లెట్ రైలు ప్రయాణాన్ని మరింత విస్తరింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి రెడీ అయింది. భాగ్యనగరం నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి హైస్పీడ్ కనెక్టివిటీని పెంచేందుకు ప్రతిపాదించిన ముంబై-పూణే- హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్కు సంబంధించిన 'డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్' (DPR) ప్లాన్ పూర్తిగా సిద్ధమైంది.
ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణానికి దాదాపు 15 గంటలు, రోడ్డు మార్గంలో అయితే 12 గంటల సమయం పడుతోంది. కానీ, ఈ సరికొత్త బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే.. కేవలం 2 గంటల 55 నిమిషాల్లోనే, అంటే 3 గంటల కంటే తక్కువ టైమ్లోనే మీరు ముంబై నుండి హైదరాబాద్ (Hyderabad) కి రీచ్ అయిపోవచ్చు. ఒకవేళ ఎక్కువ స్టాపింగ్స్ ఉన్న రైలు ఎక్కినా సరే గరిష్టంగా 3 గంటల 13 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

3 రాష్ట్రాల మీదుగా 671 కిలోమీటర్ల ప్రయాణం
ఈ సరికొత్త బుల్లెట్ రైలు కారిడార్ మొత్తం 671 కిలోమీటర్ల పొడవున మూడు రాష్ట్రాల గుండా సాగనుంది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 457 కిలోమీటర్లు, కర్ణాటకలో 121 కిలోమీటర్లు, , మన తెలంగాణలో 93 కిలోమీటర్ల మేర ఈ ట్రాక్ నిర్మించనున్నారు. ఈ రూట్లో రైళ్లు గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగంతో (300 kmph) దూసుకుపోతాయి. అంటే ప్రస్తుతం నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే ఇది దాదాపు ఐదు రెట్లు ఎక్కువ వేగమన్నమాట!
మన తెలంగాణలో స్టేషన్లు ఎక్కడంటే?
ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా మూడు రాష్ట్రాలలో అధునాతన స్టేషన్లను ప్లాన్ చేశారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ రేంజ్లో అంతర్జాతీయ ప్రమాణాలతో, విశాలమైన పార్కింగ్ , అన్ని వసతులతో ఒక్కో స్టేషన్ కోసం దాదాపు 247 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నారు.
- తెలంగాణ: శంషాబాద్ (ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర), కోకపేట్, , వికారాబాద్ లలో స్టేషన్లు ఉంటాయి. అలాగే శంషాబాద్ సమీపంలోనే ఒక పెద్ద మెయింటెనెన్స్ డిపోను కూడా నిర్మించనున్నారు.
- కర్నాటక: కలబురగి (గుల్బర్గా) వద్ద ఒక స్టాప్ ఉంటుంది.
- మహారాష్ట్ర: విక్రోలి, థానే, నవీ ముంబై, లోనావాలా, పింప్రి-చిన్చ్వాడ్, పూణే, బారామతి, పండరీపూర్, , సోలాపూర్ లలో హాల్ట్స్ ఉంటాయి. దీనివల్ల పూణే నుండి ముంబై లేదా సోలాపూర్లకు కేవలం గంటలోనే వెళ్లవచ్చు.
ఇంజనీరింగ్ సవాళ్లు.. తొలి ఏడాదిలోనే 63 వేల మంది!
ఈ ప్రాజెక్ట్లో అత్యంత కష్టమైన భాగం మహారాష్ట్రలోని ఖండాలా ఘాట్ సెక్షన్. ఈ కొండల గుండా రైలు వెళ్లడానికి 13 ప్రాంతాలలో మొత్తం 24 కిలోమీటర్ల మేర సొరంగాలు (Tunnels) తవ్వాల్సి ఉంటుంది. అలాగే మరో 35.30 కిలోమీటర్ల మేర భూగర్భ (Underground) మార్గాన్ని కూడా డిజైన్ చేశారు.
ఈ బుల్లెట్ రైలులో మొత్తం 16 కోచ్లు (భోగీలు) ఉంటాయి. ఇందులో ఒకేసారి 1,215 మంది ప్రయాణించవచ్చు. ప్రాజెక్ట్ ప్రారంభమైన మొదటి ఏడాదిలోనే ప్రతిరోజూ 63,000 మందికి పైగా ప్రయాణికులు ఈ సేవలను వాడుకుంటారని అంచనా వేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ 2026-27 లో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ పనులు వేగవంతం కావడానికి నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో భూసేకరణ విషయమై చర్చలు జరుపుతోంది.
బిజినెస్ హబ్ అయిన ముంబైకి, ఐటీ హబ్ అయిన హైదరాబాద్ (Hyderabad) కి మధ్య ఈ బుల్లెట్ ట్రైన్ వస్తే రెండు నగరాల మధ్య బంధం మరింత బలపడుతుంది. ప్రయాణ సమయం భారీగా తగ్గిపోవడం వల్ల అటు ఐటీ ఉద్యోగులకు, ఇటు వ్యాపారవేత్తలకు సమయంతో పాటు డబ్బు కూడా భారీగా ఆదా అవుతుంది. భూసేకరణ పనులు వేగంగా పూర్తయితే త్వరలోనే మనం ఈ హైస్పీడ్ జర్నీని ఎంజాయ్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications