హైదరాబాద్ నుంచి ముంబైకి ఇకపై ప్రయాణం 4 గంటలే .. రూ.36 వేల కోట్లతో జన కళ్యాణ్ ఎక్స్ప్రెస్వే వచ్చేస్తోంది..
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు మహారాష్ట్ర మొత్తం రూపురేఖలు మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా భారీ మౌలిక సదుపాయాల ప్రణాళికను ముందుకు తీసుకొచ్చింది. డిసెంబర్ 14, ఆదివారం నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సమగ్ర విజన్ను ప్రకటించారు. ఆధునిక రవాణా వ్యవస్థలు, వేగవంతమైన కనెక్టివిటీ, కొత్త వ్యాపార కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా మహారాష్ట్రను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించారు.
ఈ ప్రణాళికలో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ ముంబై-హైదరాబాద్ ఎక్స్ప్రెస్వే. సుమారు రూ.36 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఎక్స్ప్రెస్వేను 'Jankalyan Expressway'గా కూడా పిలుస్తారు. ఇది థానే, పుణే, అహల్యానగర్, బీడ్, లాతూర్ జిల్లాల గుండా ప్రయాణించి ముంబైను హైదరాబాద్తో నేరుగా కలుపుతుంది. మొత్తం 450 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ యాక్సెస్-నియంత్రిత కారిడార్ వల్ల ముంబై-హైదరాబాద్ మధ్య దూరం 180 కిలోమీటర్లకు పైగా తగ్గనుంది. దీని ఫలితంగా ముంబై నుంచి లాతూర్ వరకు ప్రయాణ సమయం సుమారు నాలుగున్నర గంటలు తగ్గుతుందని అంచనా. ఈ ఎక్స్ప్రెస్వే కేవలం రెండు నగరాలను మాత్రమే కాదు, మార్గమధ్యంలోని ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికీ దోహదపడనుంది.

దీంతో పాటుగా మహారాష్ట్రలో మరిన్ని కీలక రహదారులు, సొరంగ ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత ముంబై-పుణే కారిడార్కు సమాంతరంగా మరో ఎక్స్ప్రెస్వే, ఆరెంజ్ గేట్-మెరైన్ డ్రైవ్ సొరంగం, వెర్సోవా నుంచి ఉత్తన్, విరార్ వరకు తీరప్రాంత రహదారి విస్తరణ, థానే-బోరివిల్లి, గోరేగావ్-ములుంద్ సొరంగాలు, నవీ ముంబై విమానాశ్రయానికి సమీపంలోని పన్వేల్ తీరప్రాంత రహదారి, అటల్ సేతు ఇంటర్చేంజ్, పుణే రింగ్ రోడ్, అలాగే ఎన్నాళ్లుగానో పెండింగ్లో ఉన్న 'మిస్సింగ్ లింక్' ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు ప్రయాణాన్ని వేగవంతం చేయనున్నాయి.
వీటితో పాటుగా 'కొత్త నాగ్పూర్' పేరుతో కొత్త కేంద్ర వ్యాపార సముదాయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. సుమారు 1,710 హెక్టార్ల విస్తీర్ణంలో రూపొందించనున్న ఈ బిజినెస్ డిస్ట్రిక్ట్, ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC), పుణేలోని హింజెవాడి తరహాలో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 5 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదనంగా, అమరావతిలో ఎయిర్ ఇండియా సహకారంతో ఆధునిక వైమానిక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 34 శిక్షణ విమానాలు, 14 పైపర్ విమానాలు ఉండనున్నాయి.
ముంబై నగర మౌలిక సదుపాయాల పరంగా కూడా భారీ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం 91 కిలోమీటర్ల పొడవుతో రోజుకు సుమారు 9.5 లక్షల మంది ప్రయాణికులను సేవలందిస్తున్న ముంబై మెట్రో నెట్వర్క్ను వచ్చే రెండేళ్లలో 132 కిలోమీటర్లకు విస్తరించనున్నారు. ప్రతి సంవత్సరం కనీసం 50 కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్లను ప్రారంభించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ముంబైతో పాటు పుణే, నాగ్పూర్ నగరాల్లో కూడా మెట్రో విస్తరణ కొనసాగనుంది. ఇప్పటికే పుణేలో 33 కిలోమీటర్లు, నాగ్పూర్లో 40 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్లు పనిచేస్తున్నాయి.


Click it and Unblock the Notifications


