Damani Vs Ambani: పోరులోకి దమానీ, అంబానీ.. ఆ రంగంపై పట్టుకోసం ప్రయత్నాలు..
Damani Vs Ambani: రాకేశ్ జున్జున్వాలా గురువు రాధాకృష్ణ దమానీ, రిలయన్స్ గ్రూప్ యజమాని ముఖేష్ అంబానీల మధ్య ఇప్పుడు గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుతం వీరిద్దరూ రిటైల్ వ్యాపారంలో పోరుకు సిద్ధమయ్యారు. ఇద్దరికి చెందిన సంస్థలు తమ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
DMart నయా స్టోర్స్..
భారతీయ బిలియనీర్ రాధాకృష్ణ దమానీ స్థాపించిన డిస్కౌంట్ సూపర్ మార్కెట్ చైన్ DMart తన స్టోర్ల సంఖ్యను ఐదు రెట్లు పెంచాలని ప్రయత్నిస్తోంది. దమానీ రిటైల్ రంగంలో తన మార్కెట్ వాటాను పెంచుకోవాలనుకుంటోంది. మరోవైపు.. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ కూడా దూకుడుగా వ్యాపారాన్ని విస్తరిస్తోంది. దేశంలోని ఇతర సూపర్ మార్కెట్ చైన్లు కూడా ప్రస్తుతం తమ స్టోర్లను వేగంగా విస్తరిస్తున్నాయి. అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ తన స్టోర్ల సంఖ్యను 284 నుంచి 1,500 పెంచవచ్చని సీఈవో నవిల్ నోరోన్హా వెల్లడించారు.
రానున్న 20 ఏళ్ల వరకు..
రిటైల్ రంగంలో పెద్ద ఆటగాళ్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని నోరోన్హా అన్నారు. రానున్న 20 ఏళ్ల వరకు ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వృద్ధికి అద్భుతమైన అవకాశం ఉందని అన్నారు. అయితే ఈ సమయంలో రిలయన్స్ రిటైల్ కూడా అవెన్యూ సూపర్ మార్ట్ స్టోర్లను స్వాధీనం చేసుకోవటంతో తన మార్కెట్ ను పెంచుకుంటోంది. అంబానీ ఫోకస్ పెంచటంతో ఈ రంగంలో దిగ్గజాలైన దమానీ, అంబానీ మధ్య పోరు తీవ్రరూపం దాల్చవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మధ్యతరగతి వినియోగదారుల కోసం..
దేశంలోని మెుత్తం 140 కోట్ల జనాభాలో మధ్యతరగతి జనాభా వాటా 50 శాతానికి చేరుకోవచ్చని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. పైగా పెరుగుతున్న ద్రవ్యోల్బణ సమయంలో డిస్కౌంట్ షాపింగ్పై చాలా ఆసక్తి చూపుటం ఇందుకు కలిసొచ్చే అంశంగా ఉంది. భారీ డిస్కౌంట్లకు డిమార్ట్ ప్రసిద్ధి చెందిన సంగతి మనందరికీ తెలిసిందే. గత సంవత్సరం 50 కొత్త స్టోర్లను ప్రారంభించిన DMart వాటి సంఖ్యను మరింతగా పెంచటంతో పాటు.. లాభదాయకమైన ఈ-కామర్స్ వ్యాపారాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
ప్రారంభ దశలో వ్యవస్థీకృత కిరాణా మార్కెట్..
వ్యవస్థీకృత కిరాణా మార్కెట్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని నోరోన్హా తెలిపారు. దేశంలో వ్యవస్థీకృత కిరాణా మార్కెట్ ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉందని అభిప్రాయపడ్డారు. DMart దాదాపు ప్రతి ఉత్పత్తిపై తన కస్టమర్లకు తగ్గింపులను అందజేస్తుందని ఆయన తెలిపారు. అవెన్యూ సూపర్మార్ట్స్ షేర్ 2017లో స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ అయింది. లిస్టింగ్ సమయం నుంచి స్టాక్ 1370 శాతం రాబడిని అందించింది. ప్రస్తుతం స్టాక్ 4,466.05 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.5,899 వద్ద ఉండగా స్టాక్ కనిష్ఠ ధర రూ.3,185గా ఉంది.