Multibagger Stock: రూ.లక్షను 82 కోట్లు చేసిన స్టాక్.. ఓపిక పట్టిన వారు విజేతలయ్యారు..
Multibagger Stock: స్టాక్ మార్కెట్లో కోటీశ్వరుడు కావాలంటే కేవలం కోరిక, కంగారు ఉంటే సరిపోదు. చాలా ఓపిక కూడా కావలని నిరూపించింది ఈ స్టాక్. అవును కోటీశ్వరులు చేసే స్టాక్స్ చాలా అరుదుగా ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ సైతం త్వరగా ధనవంతులు కావాలనుకుని దురాశకు పోతే తప్పుదోవ పడతారని తెలిపారు. అయితే ఏళ్లు గడిచేకొద్ది మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తూ.. కొన్నాళ్లకు స్టాక్స్ అందనంత రేటుకు పెరిగిపోతుంటాయి.
కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది టైర్లు తయారు చేసే దేశీయ కంపెనీ MRF స్టాక్ గురించే. అవును ఒకప్పుడు కేవలం రూ.11గా ఉన్న ఈ కంపెనీ షేర్ల విలువ పెరుగుతూ దీర్ఘకాలంలో రూ.90,000 మార్కును దాటింది. అవును ఈ స్టాక్ ను పోర్ట్ ఫోలియోలో నమ్మకంగా హోల్డ్ చేసిన పెట్టుబడిదారులు ఏకంగా కోటీశ్వరులుగా మారారు. కనీసం రూ.10,000 ఇన్వెస్ట్ చేసినవారు సైతం కోటీశ్వరుడు కావటం మనం గమనించవచ్చు.
1993లో స్టాక్ పరిస్థితి..
సుదీర్ఘకాలం మంచి కంపెనీల్లో పెట్టుబడులను కొనసాగిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనకు MRF షేర్లను చూస్తే అర్థమౌతుంది. MRF అంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ అని అర్థం. ఈ షేర్ ఫేస్ వ్యాల్యూ రూ.10తో పబ్లిక్ కంపెనీగా ప్రారంభమైంది. 1993 ఏప్రిల్ 27న బీఎస్ఈలో ఒక్కో షేర్ ధర రూ.11గా ఉంది. అయితే స్టాక్ ధర ఈ రోజు అంటే జనవరి 20, 2023న రూ.90,076.15 వద్ద ట్రేడింగ్ ముగించింది. గత 30 ఏళ్లలో స్టాక్ తన ఇన్వెస్టర్లకు దాదాపుగా 8,18,772% కంటే ఎక్కువ రాబడిని అందించింది.
2022లో గరిష్ఠానికి..
టైర్ల తయారీలో అగ్రగామిగా కొనసాగుతున్న కంపెనీ షేర్ నవంబర్ 07, 2022న దాని ఆల్ టైమ్ హై అయిన రూ.95,954.35 ధరకు చేరుకుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.38,212.70 కోట్లుగా ఉంది. 30 ఏళ్ల కిందటం కంపెనీ షేర్లలో రూ.2000 పెట్టుబడిగా పెట్టి ఉంటే.. ఈ రోజు మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ దాదాపు రూ.1.63 కోట్లకు చేరుకుని ఉండేది. అదే ఎవరైనా ఇన్వెస్టర్ అప్పట్లో లక్ష పెట్టుబడిపెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని విలువ రూ.82 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం మార్కెట్లో ఎమ్ఆర్ఎఫ్ స్టాక్ అత్యంత ఖరీదైనదిగా కొనసాగుతోంది. గత ఏడాది కాలంలో 21.95% రాబడిని కూడా తెచ్చిపెట్టింది.
కంపెనీ వ్యాపారం..?
MRF భారదేశానికి చెందిన బహుళజాతి టైర్ల తయారీ కంపెనీ. పూర్వం దీనిని మద్రాసు రబ్బర్ ఫ్యాక్టరీ అని పిలిచేవారు. కంపెనీ టైర్లు, ట్రెడ్లు, ట్యూబ్లు, కన్వేయర్ బెల్ట్లు, పెయింట్స్, టాయ్స్తో పాటు స్పోర్ట్స్ గూడ్స్, మోటార్ స్పోర్ట్స్ తయారీ వ్యాపారంలో ఉంది. ఇది తమిళనాడులోని చెన్నైకి చెందిన కంపెనీ. దీనిని 1940లో రూ.14,000 నిధులతో రబ్బరు బెలూన్ ఫ్యాక్టరీగా ప్రారంభించటం జరిగింది. కానీ ఇప్పుడు కంపెనీ దేశంలోని అత్యంత ప్రజాధరణ పొందిన టైర్ల తయారీ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది.