Mudra Yojana: కోట్ల మంది జీవితాలను మార్చేసిన పీఎం ముద్ర యోజన.. పూర్తి వివరాలు
Mudra Yojana: దేశంలో అనేక మంది ఆకాంక్షలను, వ్యాపార ఆలోచనలను నిజం చేసుకునేందుకు ప్రధాన మంత్రి ముద్ర యోజన కీలక పాత్ర పోషించింది. సూక్ష్మ, చిన్న మధ్యతరహా వ్యాపారాలను ప్రారంభించాలకున్న వారి కలలను ఇది సాకారం చేసింది.
ఈ స్కీమ్ దేశంలో ప్రారంభించి ఏప్రిల్ 7 నాటికి ఎనిమిది వసంతాలు పూర్తైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలోని వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ పథకం కింద ఇప్పటి వరకు 40.82 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.23.2 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశాయని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), మైక్రోఫైనాన్స్ సంస్థలు కీలక పాత్ర పోషించాయని ఆమె వెల్లడించారు.

ఈ స్కీమ ద్వారా అర్హులకు తమ వ్యాపార ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకు రూ.10 లక్షల వరకు రుణాలను అందించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 8, 2015న దీనిని ప్రారంభించారు. పథకం కింద ఉన్న ఖాతాలలో 68% మహిళా పారిశ్రామికవేత్తలకు చెందినవి కాగా.. 51 శాతం ఖాతాలు SC/ST మరియు OBC వర్గాలకు చెందిన వ్యాపారవేత్తలకు చెందినవి.
ఈ స్కీమ్ MSMEలను బలోపేతం చేసేందుకు దోహదపడిందని ఆర్థిక మంత్రి ఎత్తిచూపారు. ఎంఎస్ఎంఈల వృద్ధి 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి భారీగా దోహదపడిందని అన్నారు. బలమైన దేశీయ MSMEలు దేశీయ మార్కెట్లతో పాటు ఎగుమతుల కోసం దేశీయ ఉత్పత్తిని పెంచుతాయన్నారు. అట్టడుగు స్థాయిలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పనలో, భారత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలో గేమ్ ఛేంజర్గా ఈ స్కీమ్ నిలిచిందని నిర్మలమ్మ వెల్లడించారు.
చిన్న వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ఈ పథకం ప్రారంభించబడింది. శిశు (రూ.50,000 వరకు), కిషోర్ (రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు), తరుణ్ కింద రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణాలను ఈ పథకం అందిస్తుంది. ప్రస్తుతం మెుత్తం రుణాల్లో 83 శాతం శిశు, 15 శాతం కిషోర్, మిగిలిన 2 శాతం తరుణ్ లోన్స్ అందించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.


Click it and Unblock the Notifications