ఏప్రిల్ 2020 నుండి ఫిబ్రవరి 2021 వరకు 10వేల కంపెనీల మూసివేత
గత ఏడాది ఏప్రిల్ నుండి ఈ ఫిబ్రవరి వరకు దేశంలో పదివేలకు పైగా కంపెనీలు స్వచ్చంధంగా మూతపడ్డాయని ప్రభుత్వం తెలిపింది. కరోనా, లాక్ డౌన్ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలకు అవరోధాలు ఏర్పడటం ఇందుకు కారణమైనట్లు వెల్లడించింది. కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ వద్ద లభ్యమవుతోన్న తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 2014 కంపెనీల చట్టంలోని సెక్షన్ 248(2) కింద మొత్తం 10,113 కంపెనీలను మూసివేశారు.
ఎలాంటి చట్టపర చర్యలు లేకుండా, కేవలం స్వచ్చంధంగా వ్యాపారాలను కంపెనీలు నిలిపివేసిన అంశాన్ని సెక్షన్ 248(2) చెబుతోంది. ఇందులో అత్యధికంగా ఢిల్లీలో 2,394 కంపెనీలు మూతపడ్డాయి. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్లో 1,936 కంపెనీలు, తమిళనాడులో 1,322 కంపెనీలు, మహారాష్ట్రలో 1,279 కంపెనీలు, కర్ణాటకలో 836 కంపెనీలు, చండీగఢ్లో 501 కంపెనీలు, రాజస్థాన్లో 479 కంపెనీలు, తెలంగాణలో 404 కంపెనీలు, కేరళలో 307 కంపెనీలు, జార్ఖండ్లో 137 కంపెనీలు, మధ్యప్రదేశ్లో 111 కంపెనీలు, బీహార్లో 104 కంపెనీలను స్వచ్ఛందంగా మూసివేశారు.
2020-21లో వ్యాపారాలను ఆపివేసిన లిస్టెడ్ కంపెనీల వివరాలను తెలియజేయాలని పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ బదులిస్తూ పైవివరాలు అందించారు.