సాధ్యమైనంత త్వరగా చేయండి: లోన్ మారటోరియంపై కేంద్రానికి సుప్రీంకోర్టు డెడ్లైన్!
కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ పైన వడ్డీ (చక్ర వడ్డీ) రాయితీని నవంబర్ 2వ తేదీలోగా అమలు చేయాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సగటు మనిషి దీపావళి పండుగ ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉందని జస్టిస్ ఎంఆర్ షా పేర్కొన్నారు. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్న వారికి వడ్డీపై వడ్డీని మినహాయింపును ఇస్తూ తీసుకున్న నిర్ణయం అమలులో ఎందుకు జాప్యం జరుగుతోందని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడన ధర్మాసనం బుధవారం కేంద్రాన్ని ప్రశ్నించింది.
అందుకే జాప్యం
వడ్డీపై వడ్డీ రద్దుకు నవంబర్ 15వ తేదీ వరకు సమయం కావాలని కేంద్రం అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. సామాన్యులు ఆందోళనలో ఉన్నారని, వెంటనే ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నవంబర్ 2లోగా ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలని కేంద్రం నిర్ణించిందని, కానీ అది ఇంకా అమల్లోకి రాలేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. జాప్యం ఎందుకు అని కోర్టు నిలదీసింది. దీనిపై తుషార్ మెహతా స్పందిస్తూ.. రుణాలు ఇవ్వడంలో చాలా పద్ధతులు ఉంటాయని, వీటిపై బ్యాంకులతో సంప్రదింపులు జరపాలన్నారు. దీనికి సుప్రీం స్పందిస్తూ సామాన్యుల దీపావళి మీ చేతుల్లో ఉందని వ్యాఖ్యానించింది.
యాక్షన్ ప్లాన్ కీలకం
సామాన్యుని ఇబ్బందులు అర్థం చేసుకుంటామని, వడ్డీపై వడ్డీ భారం లేకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్పడం ఆహ్వానించదగిన అంశం అని, కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, కేవలం అఫిడవిట్ మాత్రమే అందించారని, వడ్డీ రద్దు ప్రయోజనాన్ని ఎలా అందిస్తారనేది ఇప్పుడు కీలక అంశమని పేర్కొంది. రద్దు యాక్షన్ ప్లాన్కు సంబంధించిన ఆదేశాలు ఇచ్చారా స్పష్టం చేయాలని సుప్రీం కోర్టు పేర్కొంది. రూ.2 కోట్ల వరకు ఊరటను సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని సూచించింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
కేంద్రం.. బ్యాంకులు రెడీ
కరోనా మారటోరియానికి సంబంధించి రుణాల వడ్డీపై వడ్డీ విధించటాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయగా రూ.2 కోట్ల లోపు రుణాలపై విధించే చక్రవడ్డీని భరించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కాగా, కేంద్రం నిర్ణయం ఏదైనా అమలు చేసేందుకు సిద్ధమని బ్యాంక్స్ అసోసియేషన్ తరఫు సీనియర్ అడ్వోకేట్ హరీష్ సాల్వే తెలిపారు. తగిన ద్రవ్యవిధానం, ప్రతిపాదనల అమలు లేకుండా ఆయా రుణాలను ఎన్పీఏలుగా వర్గీకరించవద్దని ఇటీవల సుప్రీం కోర్టు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది.