Moody's: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశ GDP 2022లో 3.5 ట్రిలియన్ల మార్కును దాటింది. రాబోయే కొన్నేళ్లలో G-20 దేశాల్లోని మేటి ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోంది. అయితే సంస్కరణలు మరియు విధానపరమైన అడ్డంకులు వల్ల ఇండియాలోకి పెట్టుబడులు తరలిరావడానికి ఆటంకం ఏర్పడవచ్చని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ తెలిపింది.
లైసెన్స్ లు, అనుమతులు పొందడంతో పాటు వ్యాపారాలను ఏర్పాటు చేయడం కోసం అధిక సమయం పట్టడం అభివృద్ధి పథంలో ఓ విఘాతంగా మూడీస్ అభిప్రాయపడింది. పలు డిపార్ట్ మెంట్స్ ఆమోదం పొందాల్సి ఉండటమూ ఇబ్బందిగా ఉంటోందని తన నివేదికలో వెల్లడించింది. తద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(FDI)ను ఆకర్షించే అవకాశం తగ్గిపోతుందని పేర్కొంది. ఇండోనేషియా, వియత్నాం వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోటీపడుతున్నప్పుడు వీటిని గమనించాల్సిన అవసరం ఉందని సూచించింది.

దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న యువత, విద్యావంతులైన శ్రామికశక్తి, పెరుగుతున్న చిన్న కుటుంబాలు, మరియు పట్టణీకరణ వెరసి గృహాలు, సిమెంట్, కొత్త కార్లు వంటి పలు ఉత్పత్తుల కోసం డిమాండ్ను పెంచుతుందని రేటింగ్ సంస్థ పేర్కొంది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై చేసే వ్యయం ఉక్కు మరియు సిమెంట్ను రంగాలను బలపరుస్తుంది. నెట్-జీరో వైపు ప్రయాణిస్తున్న ఇండియాలో పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
తయారీ మరియు మౌలిక సదుపాయాల రంగాలలో డిమాండ్ దాదాపు 12 శాతం వరకు వృద్ధి చెందుతుందని మూడీస్ చెప్పింది. 2030 నాటికి చైనాను వెనక్కునెట్టే సామర్థ్యం భారత్ సొంతమని వ్యాఖ్యానించింది. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ.. విధానాల అమల్లో నెమ్మది కారణంగా తయారీ మరియు మౌలిక సదుపాయాల రంగాలలో పెట్టుబడుల వేగం మందగించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.


Click it and Unblock the Notifications