Monetary Policy 2021: RBI మానిటరీ పాలసీ ముందు రిస్క్ ఫ్యాక్టర్స్
ముంబై: ఆరుగురు సభ్యులతో కూడిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఈసారి రెపో రేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 5వ తేదీ నుండి 7వ తేదీల్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరగనుంది. 2020 మే నెలలో వడ్డీ రేటును నాలుగు శాతానికి తగ్గించారు. వివిధ కారణాలతో ఇది దాదాపు ఏడాది కాలంగా యథాతథంగా ఉంది. దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభించడం, రిటైల్ ద్రవ్యోల్భణం దాదాపు 4 శాతంగా ఉంచాలని ప్రభుత్వం సూచించడం ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్బీఐ కీలక రేట్లను నిర్ణయించే MPC సమావేశం నేడు ప్రారంభమవుతుంది. శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు నిర్ణయాలు తీసుకుంటారు.
వృద్ధి చర్యలు
ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యం (+2 శాతం నుండి -2 శాతం, మార్జిన్ 2-6 శాతం) వద్ద అదుపులో ఉంచాలన్న ప్రధాన లక్ష్యంతో పాటు వృద్ధికి ఊతమిచ్చేందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలను ప్రకటించేందుకు ఆర్బీఐ మొగ్గు చూపవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది. ఆర్థిక రికవరీ వేగవంతంగా కనిపిస్తున్నప్పటికీ అసంబద్దంగా ఉందని, కనిష్టాల నుండి వృద్ధి బలంగా పుంజుకుందని, కానీ నెమ్మదిగా పెరుగుతోందని అంటున్నారు. పెరుగుతున్న కరోనా కేసులు సవాల్ అంటున్నారు.
ద్రవ్యోల్భణం, క్రూడాయిల్
ఆర్బీఐ మానిటరీ పాలసీ ముందు పలు సవాళ్లు ఉన్నాయని చెబుతున్నారు. ద్రవ్యోల్భణం పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఆర్బీఐ నాలుగు శాతం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఫిబ్రవరిలో 5.03 శాతంగా ఉంది. హోల్ సేల్ ద్రవ్యోల్భణం జనవరి నెలలో 2.26 శాతం కాగా ఫిబ్రవరిలో దాదాపు రెండింతలు పెరిగి 4.17 శాతంగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లు చమురు ధరలు పెరగడం కూడా ప్రభావం చూపుతాయి. గత ఆరు నెలల కాలంలో క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు 40 డాలర్ల నుండి 70 డాలర్లకు పెరిగాయి. ప్రస్తుతం 65 డాలర్ల వద్ద కదలాడుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ ఆందోళన
కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. రికవరీ వేగవంతమవుతోన్న సమయంలో కరోనా మరోసారి సవాల్ విసురుతోంది. జీ-సెక్ యీల్డ్స్ పదేళ్ల పెరుగుతున్నాయి. డిపాజిట్ వడ్డీ రేట్లను ఇటీవల బ్యాంకులు పెంచాయి. ఎస్బీఐ జనవరి నెలలో టర్మ్ డిపాజిట్ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. HDFC లిమిటెడ్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇలా పలు అంశాలు ఆర్బీఐ మానిటరీ నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి.