ఇది భరించలేం!: 'టారిఫ్' రూటుమార్చిన కస్టమర్, దెబ్బతో డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: ఇటీవల టెలికం సంస్థలు జియో, ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా టారిఫ్ పెంచిన విషయం తెలిసిందే. వివిధ టెలికం సంస్థలు 50% వరకు పెంచాయి. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ వినియోగదారులు ప్రీపెయిడ్ రీఛార్జీలపై సగటున దాదాపు 40% అదనంగా చెల్లించవలసి వస్తోంది. దీంతో వారు మొబైల్ వినియోగాన్ని అంటే డేటా, కాల్స్ను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. అంతేకాదు, టారిఫ్ దెబ్బతో తమ కాల్, డేటా ప్లాన్స్ కూడా మార్చుకుంటున్నారు.
రూ.1200తో ఫేక్ రివ్యూస్: అమెజాన్ను, కస్టమర్లకు భలే బురిడీ!
ఆ దెబ్బతో డిస్కౌంట్ ఆఫర్
ఇన్నాళ్లు ఏడాది వరకు ప్లాన్స్ తీసుకున్న పలువురు కస్టమర్లు ఇప్పుడు టారిఫ్ పెరిగిన తర్వాత కేవలం నెల రోజుల ప్లాన్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మూడు నెలలు, సంవత్సర కాలపరిమితిని ఇప్పటి వరకు ఉపయోగించిన కస్టమర్లు ఇప్పుడు నెల రోజుల కోసం రీఛార్జ్ చేసుకుంటున్నారు. తక్కువ కాలపరిమితి కలిగిన ప్లాన్స్ వల్ల టెలికం సంస్థలకు ఓ ఇబ్బంది ఉంది. వారు నెల రోజులో ఉపయోగిస్తారు కాబట్టి పోర్ట్ ద్వారా మరో టారిఫ్ తక్కువ ఉన్న కంపెనీకి మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగానే భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లు 12 నెలల రీఛార్జ్పై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి.
ఒక్కసారిగా అంత భరించలేక.. నెల రోజులకే..
టారిఫ్ పెంచకముందు 84 రోజుల కాలపరిమితికి గాను రూ.300 మొబైల్ ప్లాన్ను రీఛార్జ్ చేసిన కస్టమర్ ఇప్పుడు రూ.500 భరించలేకపోతున్నారని, అందుకే నెలవారీ రీఛార్జ్ చేసుకుంటున్నారని ముంబైకి చెందిన భారతీ ఎయిర్ టెల్ డిస్ట్రిబ్యూటర్ అన్నారు. ధరల పెరుగుదల, తగ్గుదల చాలా సెన్సిటివ్ అంశమని, కస్టమర్లు ఈ సవరింపును అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారు.
కేవలం డేటా వినియోగం కోసమే...
కొంతమంది వినియోగదారులు డేటా రీఛార్జీలపై దృష్టి సారించారు. దీంతో పెరిగిన టారిఫ్ బిల్లులు ఖర్చు ప్యాటర్న్ను మార్చి వేశాయి. ఓ ఉబర్ డ్రైవర్ కేవలం జీపీఎస్ డివైస్ కోసం మాత్రమే రీఛార్జ్ చేసుకుంటాడని, ఎందుకంటే ట్యాక్సీ నడిపేందుకు అది అవసరమని, కానీ తన పర్సనల్ డివైస్ కాల్స్ కోసం అంతగా రీఛార్జ్ చేసుకోకపోవచ్చునని వొడాఫోన్ స్టోర్ మేనేజర్ రవి అన్నారు.
దశాబ్దం క్రితం 6 శాతం, ఇప్పుడు 1 శాతం కంటే తక్కువ
అయితే, డేటా, కాల్ టారిఫ్స్ భారత్లోనే చౌకగా ఉన్నాయని టెలికం కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దశాబ్దం క్రితం భారతీయ కస్టమర్ తన ఏడాది ఆదాయంలో 6 శాతం వరకు మొబైల్ బిల్స్ కోసం ఖర్చు చేశారని, కానీ ఇప్పుడు కేవలం 1 శాతాని కంటే తక్కువగా ఖర్చు చేస్తున్నారని సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ అన్నారు. హయ్యర్ టారిఫ్ కాల్ క్వాలిటీని మరింతగా పెంపొందిస్తాయని చెప్పారు. ఇండియన్ మొబైల్ యూజర్లు ప్రస్తుత టారిఫ్కు అడ్జస్ట్ కావడానికి కొద్ది నెలలు పడుతుందని చెప్పారు. ప్రస్తుత టారిఫ్ను అర్థం చేసుకోవడానికి కస్టమర్కు జనవరి-మార్చి క్వార్టర్ వరకు పట్టవచ్చునని రాజన్ చెప్పారు.
మరో మూడు నెలలు...
డిసెంబర్ నెలలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, జియో టారిఫ్ పెంచిన విషయం తెలిసిందే. దీంతో 90 శాతంగా ఉన్న ప్రీపెయిడ్ కస్టమర్లు దీనిని భారంగా భావిస్తున్నారు. అయితే దీని వల్ల ఆయా టెలికం సంస్థ ఆర్పు పెరగనుంది. ఇది ఈ రంగానికి శుభసూచకమని చెబుతున్నారు. కానీ కస్టమర్ మాత్రం ఇంతకుముందు మూడు నెలల కోసం రీఛార్జ్ చేసుకుంటే ఇప్పుడు దానిని నెలకు పరిమితం చేసుకుంటున్నారని, వారి మొబైల్ టారిఫ్ ఖర్చులు 40 శాతం నుంచి 50 శాతం వరకు పెరుగుతున్నాయని ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ రాజీవ్ శర్మ అన్నారు. కస్టమర్లు తమ కాలపరిమితిని తగ్గించుకున్నప్పటికీ ఆర్పు మాత్రం పెరుగుతుందని, ఇది ఈ రంగానికి మంచిదేనని అభిప్రాయపడ్డారు.
ఆర్పు ఎంత పెరగవచ్చునంటే...
రానున్న రెండు క్వార్టర్లలో వొడాఫోన్ ఐడియా ఆర్పు రూ.107 నుంచి రూ.143కు పెరగవచ్చునని, ఎయిర్ టెల్ ఆర్పు రూ.128 నుంచి రూ.145-రూ.150కి పెరవగచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిలయన్స్ జియో ఆర్పు రూ.140కి పెరగవచ్చునని భావిస్తున్నారు.