మళ్లీ లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించండి: సుప్రీంలో పిటిషన్
కరోనా సెకండ్ వేవ్ ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా మధ్య తరగతి వర్గాలపై ప్రభావం చూపింది. గత ఏడాది కరోనా నేపథ్యంలో మార్చి నుండి ఆగస్ట్ వరకు మారటోరియం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సెకండ్ వేవ్ నేపథ్యంలో రుణాలపై మరోసారి మారటోరియం కల్పించాలని కోరుతూ ఓ NGO సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
జూన్ నుంచి ఆగస్ట్ వరకు రుణ చెల్లింపులకు బ్యాంకులు మారటోరియం కల్పించేందుకు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరింది. ఏప్రిల్-ఆగస్ట్ మధ్య కాలంలో EMISలు చెల్లించని ఖాతాలను మొండిపద్దుల్లో చేర్చకుండా బ్యాంకులను నిలువరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐని ఆదేశించాలని కోర్టును కోరింది. ట్రస్ట్ డిస్ట్రెస్ మేనేజ్మెంట్ కలెక్టివ్ అనే ఎన్జీవో ఫైల్ చేసిన ఈ వ్యాజ్యం త్వరలో విచారణకు రానుంది.
కరోనా సంక్షోభ ప్రభావిత వర్గాలను ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజీని రూపొందించాల్సిందిగా సంబంధిత అధికారులను సైతం నిర్దేశించాలని కోర్టును కోరింది. మధ్య తరగతిపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపింది.