Bengaluru News: 45 నిమిషాల పాటు నిలిచిపోయిన మెట్రో సేవలు.. అవస్థలు పడ్డా ప్రయాణికులు..!
బెంగళూరులో మెట్రో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. మంగళవారం ఉదయం బెంగళూరులోని మెట్రో గ్రీన్ లైన్ సేవలకు దాదాపు 45 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అంతరాయం వల్ల బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) యశ్వంత్పూర్, మాదవర మధ్య రైళ్ల కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఉదయం 8 గంటల సమయంలో గ్రీన్ లైన్ ఉత్తర విభాగంలో విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో ఏర్పడింది. దీంతో మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఉదయం 8.45 గంటలకు సాధారణ సేవలు పునఃప్రారంభమయ్యాయి.
విద్యుత్ అంతరాయం సమయంలో మెట్రో రైళ్లు సిల్క్ ఇన్స్టిట్యూట్, యశ్వంత్పూర్ స్టేషన్ల మధ్య కేవలం ఒక చిన్న లూప్లో మాత్రమే నడిచాయి. ఉదయం రద్దీ సమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు 45 నిమిషాల పాటు మెట్రో స్టేషన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. కొంత మంది ప్రత్యామ్నాయ రవాణా మార్గాల ద్వారా వెళ్లిపోయారు. దీనిపై బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పందించింది. కార్యకలాపాలను పునరుద్ధరించడానికి తమ సాంకేతిక బృందాలు యుద్ధ ప్రాతిపదికన చేశాయని తెలిపింది.

ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి కార్పొరేషన్ విచారం వ్యక్తం చేసింది. ప్రయాణికుల సహనానికి, సహకారానికి ధన్యవాదాలు తెలిపింది.దక్షిణాన ఉన్న సిల్క్ ఇన్స్టిట్యూట్ను ఉత్తరాన ఉన్న మాదవరతో కలిపే గ్రీన్ లైన్, నమ్మ మెట్రోలో అత్యంత రద్దీగా ఉండే కారిడార్లలో ఒకటి. ఈ లైన్ గుండా ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారు. ఈ మధ్య కాలంలో మెట్రోలో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. జూన్ 23న, కబ్బన్ పార్క్ సమీపంలోని అండర్గ్రౌండ్ విభాగంలో ఒక రైలులో తలెత్తిన పెద్ద సాంకేతిక లోపం పర్పుల్ లైన్ సేవలను నిలిపివేసింది.
కేవలం మూడు రోజుల తర్వాత అేటే జూన్ 26న కబ్బన్ పార్క్ వద్ద ఒక ప్రయాణికుడి లోహపు గొలుసు రైలు డోర్ లో ఇరుక్కుపోవడంతో పర్పుల్ లైన్లో మరో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల సర్వీసులు 17 నిమిషాలు ఆలస్యం కావడంతో పాటు, అనేక స్టేషన్లలో తీవ్రమైన రద్దీ ఏర్పడింది. జూలై 9న ఉదయం రద్దీ వేళల్లో బనశంకరి సమీపంలో సిగ్నలింగ్ లోపం తలెత్తడంతో గ్రీన్ లైన్లో కూడా రైళ్లు భారీగా ఆలస్యమయ్యాయి.


Click it and Unblock the Notifications