పోలీసులకు అలా పట్టుబడ్డాడు: గర్ల్ ఫ్రెండ్తో కలిసి మెహుల్ చోక్సీ రొమాంటిక్ ట్రిప్
PNB స్కాం నిందితుడు, వజ్రాలవ్యాపారి మెహుల్చోక్సీ ఇటీవల ఆంటిగ్వా నుండి పారిపోయి, ఆ తర్వాత డొమినికాలో అరెస్టైన విషయం తెలిసిందే. జైలులో ఉన్నట్లు అతనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అతను డొమినికాలో పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అతని ఒంటి పైన గాయాలు కూడా కనిపిస్తోన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో మరో ఆసక్తికర అంశం వెల్లడైంది. అతను ఆంటిగ్వా నుండి తన గర్ల్ ఫ్రెండ్తో డొమినికా రొమాంటిక్ ట్రిప్కు వెళ్లి అక్కడ పట్టుబడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆంటిగ్వా పీఎం గాస్టోన్ బ్రౌన్ తెలిపారు.
ఆంటిగ్వా ప్రధాని ఏమన్నారంటే
మెహుల్ చోక్సీ తప్పు చేశాడని, అతను తన గర్ల్ ఫ్రెండ్తో ఎక్కడికో ప్రయాణిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, సరదాగా గడుపుదామనో, డిన్నర్ కోసమో ఆమెతో కలిసి డొమినికాకు బోటులో వెళ్లాడని, అయితే అనుకోకుండా అతను డొమినికాలో పోలీసులకు పట్టుబడ్డాడని గాస్టోన్ బ్రౌన్ అన్నారు. అతనిని అక్కడి నుండి భారత్ పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గాస్టోన్ బ్రౌన్ స్థానిక మీడియాతో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
భారత్కు అప్పగించే అవకాశాలు
ఆంటిగ్వాలో ఉంటే ఇక్కడి పౌరుడు కాబట్టి ఆయనకు రక్షణ ఉంటుందని, తాము మెహుల్ చోక్సీని భారత్కు అప్పగించలేమని, ఆంటిగ్వా-బార్బుడా ప్రధాని గాస్టోన్ బ్రౌన్ అన్నారు. జూన్ 2వ తేదీన కేసు తదుపరి విచారణకు వచ్చేదాకా మెహుల్ చోక్సీని డొమినికాలోనే ఉంచాలని అక్కడి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు భిన్నంగా ఉంటే తప్పితే చోక్సీని డొమినికా ప్రభుత్వం భారత్కు అప్పగించే అవకాశాలున్నాయి. మరోవైపు, మెహుల్ చోక్సీకు కొవిడ్ పరీక్షలు చేయగా, నెగిటివ్ వచ్చింది.
జెట్ విమానంలో డొమినికాకు..
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13,500 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీ(62)ని భారత్కు తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మెహుల్ చోక్సీ ఆర్థిక నేరాలకు సంబంధించిన పత్రాలను భారత్ ఈనెల 28వ తేదీన ఒక ప్రయివేటు జెట్ విమానంలో డొమినికాకు పంపించింది. PNB స్కాం కేసులో మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి చోక్సి నిందితుడిగా ఉన్నాడు.