మసాలాల మహరాజు మహాశయ్ ధరంపాల్ కన్నుమూత: పాకిస్తాన్ నుంచి ఢిల్లీకి
న్యూఢిల్లీ: ఎండీహెచ్ స్సైసెస్ గ్రూప్ కంపెనీల అధినేత మహాశయ్ ధరంపాల్ గులాటీ కన్నుమూశారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేశ రాజధానిలోని మాతా చానన్ దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడం, అదే సమయంలో గుండెపోటు రావడంతో గురువారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. మహాశయ్ గులాటీ మరణం పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మసాలా దినుసుల రంగంలో మహారాజుగా గుర్తింపు పొందారు మహాశయ్. ఎండీహెచ్ పేరుతో ప్రత్యేకంగా స్పెసెస్ కంపెనీని నెలకొల్పారు. దశలవారీగా దాన్ని విస్తరింపజేశారు. ఎండీహెచ్ పూర్తిపేరు.. మహాశియన్ దీ హట్టి. 1923లో అవిభాజ్య భారత్లోని సియాల్ కోట్లో జన్మించారు. ప్రస్తుతం ఈ నగరం పాకిస్తాన్లో ఉంది. మసాలా దినుసుల వ్యాపారం గులాటీ కుటుంబంలో వంశపారపర్యంగా వస్తోంది. తన తండ్రి మహాశయ్ చున్నీలాల్ గులాటీ వారసత్వాన్ని మహాశయ్ కొనసాగించారు. సియాల్కోట్లో మసాలా దినుసుల వ్యాపారాన్ని చేపట్టారు.

దేశ విభజన అనంతరం ఆయన తన కుటుంబంతో సహా ఢిల్లీకి తరలి వచ్చారు. కరోల్బాగ్లో నివాసం ఉంటున్నారు. తొలుత కరోల్ బాగ్లో ఓ చిన్న దుకాణంగా ఎండీహెచ్ మసాలా దినుసుల విక్రయాలను ప్రారంభించారు. క్రమంగా అది మహావృక్షంలా మారింది. దేశంలోనే అతిపెద్ద మసాలా తయారీ సంస్థగా ఆవిర్భవించింది. ప్రముఖ వ్యాపారవేత్తగా మహాశయ్ ధరంపాల్ గులాటీ పేరు ప్రఖ్యాతులు సాధించారు. 2019లో ఆయన మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ను అందుకున్నారు. అత్యంత స్ఫూర్తిదాయక వ్యాపార, పారిశ్రామికవేత్తగా నిలిచారాయన.
మహాశయ్ గులాటీ మరణం పట్ల అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. మహాశయ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఇప్పటిదాకా తాను ఆయనను కలుసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆయన నుంచి తాను స్ఫూర్తిపొందానని చెప్పారు. మహాశయ్ మరణం తనకు దిగ్భ్రాంతి కలిగించిందని మనీష్ సిసోడియా చెప్పారు. ఆయనతో కలిగి దిగిన కొన్ని ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications