9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.30 లక్షల కోట్లు జంప్, రిలయన్స్ ఒక్కటే బేజారు
ముంబై: దేశంలోని పది అత్యంత విలువైన కంపెనీల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా పెరిగింది. ఈ సంస్థల ఆదాయం రూ.2,30,219.82 కోట్ల మేర పెరిగింది. HDFC బ్యాంకు, HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్ని కంపెనీల కంటే ఎక్కువగా పెరిగింది. గత వారం సెన్సెక్స్ 2,278.99 పాయింట్లు లేదా 5.75 శాతం ఎగిసింది. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ మినహా మిగతా కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది.
బ్యాంకింగ్ అదుర్స్
HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.68,430.18 కోట్లు పెరిగి రూ.7,19,948.29 కోట్లకు పెరిగింది. గతవారం భారీగా లాభపడిన కంపెనీల్లో HDFC బ్యాంకు ముందు ఉంది.
HDFC మార్కెట్ క్యాప్ రూ.38,484.05 కోట్లు పెరిగి రూ.3,83,771.94 కోట్లుగా నమోదయింది.
ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ.34,892.98 కోట్లు పెరిగి రూ.3,05,629.04 కోట్లుగా ఉంది.
కొటక్ మహీంద్ర బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.33,649.7 కోట్లు పెరిగి రూ.3,39,980.79 కోట్లుగా నమోదయింది.
గతవారం భారీగా మార్కెట్ క్యాప్ పెరిగిన మొదటి నాలుగు బ్యాంకింగ్ రంగానికి చెందినవే.
నాలుగు సంస్థల ఎం-క్యాప్ రూ.1.70 లక్షల కోట్లుగా ఉంది. అంటే మొత్తం మార్కెట్ క్యాప్లో మూడొంతులు బ్యాంకింగ్ రంగానివే.
ఐటీ కంపెనీలు జూమ్
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,489.7 కోట్లు పెరిగి రూ.4,74,242.93 కోట్లుగా ఉంది.
టాటా కన్సల్టెన్సీ మార్కెట్ క్యాప్ రూ.16,285.35 కోట్లు ఎగిసి రూ.10,16,239.59 కోట్లుగా ఉంది. అంతకుముందు వారం రూ.10 లక్షలకోట్ల దిగువకు చేరుకున్న టీసీఎస్ ఎం-క్యాప్ గతవారం మళ్లీ ఈ మార్కును దాటింది.
భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.8,810.72 కోట్లు ఎగిసి రూ.2,45,363.69 కోట్లుగా నమోదయింది.
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.5,169.03 కోట్లు పెరిగి రూ.4,92,067.57 కోట్లుగా ఉంది.
హెచ్సీఎల్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాప్ రూ.2,008.11 కోట్లు పెరిగి రూ.2,30,824.35 కోట్లుగా నమోదయింది.
రిలయన్స్ ఒక్కటే డౌన్
గత వారం కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ మాత్రమే దారుణంగా పతనమైంది. రూ.17,141.77 కోట్లు పతనమై మార్కెట్ క్యాప్ రూ.13,72,017.43 కోట్లుగా ఉంది. గతవారం ఓ సమయంలో మార్కెట్ క్యాప్ రూ.13 లక్షల కోట్ల దిగువకు చేరుకుంది. అంతకుముందు వారం సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో గతవారం రెండు రోజుల్లో ఈ స్టాక్ ధర భారీగా పడిపోయింది. ఓ సమయంలో రూ.1900 దిగువకు చేరుకుంది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంది.
మార్కెట్ క్యాప్ పరంగా టాప్ టెన్ కంపెనీలు వరుసగా రిలయన్స్, TCS, HDFC బ్యాంకు, HUL, ఇన్ఫోసిస్, HDFC, కొటక్ మహీంద్ర బ్యాంకు, ICICI బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, HCL టెక్నాలజీస్ ఉన్నాయి.