భారీగా పతనమైన మార్కెట్లు: సెన్సెక్స్ 1700 పాయింట్లు పతనం
స్టాక్ మార్కెట్లు శుక్రవారం(నవంబర్ 26) భారీ నష్టాల్లో ముగిశాయి. ఐరోపాలో కరోనా కేసులు పెరుగుతుండటం కలవరానికి గురి చేసింది. దీనికి తోడు దక్షిణాఫ్రికాలో పుట్టుకువచ్చిన కొత్త కరోనా వేరియంట్ ఇన్వెస్టర్లను నిండా ముంచింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోను కోలుకోలేదు. సెన్సెక్స్, నిఫ్టీలు 3 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ ఉదయం 1300 పాయింట్ల నష్టం నుండి, మధ్యాహ్నం 1500 పాయింట్ల నష్టం నుండి కాస్త కోలుకున్నట్లు కనిపించినప్పటికీ, చివరి గంటలో భారీగా నష్టపోయి, దాదాపు 1700 పాయింట్ల నష్టంతో ముగిసింది.
సెన్సెక్స్ 58,254.79 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,254.79 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,993.89 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,338.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,355.40 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,985.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 1,687.94 (2.87%) పాయింట్లు నష్టపోయి 57,107.15 పాయింట్ల వద్ద, నిఫ్టీ 509.80 (2.91%) పాయింట్లు నష్టపోయి 17,026.45 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఓ సమయంలో 57,000 దిగువకు పడిపోయింది. గత ఏడు నెలల కాలంలో సెన్సెక్స్ భారీ నష్టం ఇదే. భారత్ వీఐఎక్స్ 25 శాతానికి పెరిగింది. సెన్సెక్స్ 30 స్టాక్ ఇండెక్స్లో 28 స్టాక్స్ నేడు నష్టాల్లో ముగిశాయి. డాక్టర్ రెడ్డీస్, నెస్ట్లే మాత్రమే లాభపడ్డాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ అక్టోబర్ 19న ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టం 18,604 పాయింట్లు. గత నెల రోజుల కాలంలో సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 8 శాతం చొప్పున పతనమయ్యాయి. దీంతో ఇన్వెస్టర్స్ సంపద రూ.16 లక్షల కోట్లు హరించుకుపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ మార్కెట్ క్యాప్ రూ.2,74,69,606.93 (అక్టోబర్ 19న) నుండి ఇప్పుడు రూ.2,58,30,168.59 కోట్లకు తగ్గింది.
సౌతాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ ఆందోళనలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కొత్త కరోనా పట్ల అప్రమత్తమై, దీని నియంత్రణపై చర్చించనుంది. ఇటీవలి వరకు ప్రాఫిట్ బుకింగ్, ఆ తర్వాత ద్రవ్యోల్భణ భయాలకు కొత్త వేరియంట్ తోడై అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. ఆసియా మార్కెట్లు అన్ని కూడా నష్టాల్లోనే ఉన్నాయి. అమెరికా నేతృత్వంలోని చమురు వినియోగ దేశాలు క్రూడ్ నిల్వలను విడుదల చేస్తుండటంతో ప్రపంచ సరఫరా మిగులు పెరుగుతుందనే ఆందోళనతో చమురు ధరలు శుక్రవారం 1 శాతానికి పైగా క్షీణించాయి. బ్రెంట్ క్రూడ్ 81.26 శాతానికి, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 77.04 శాతానికి తగ్గింది. కరోనా కొత్త వేరియంట్ కారణంగా పలు దేశాల్లో లాక్ డౌన్ ఉంటుందనే ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్లొవేకియా రెండు వారాల లాక్ డౌన్ ప్రకటించింది.చెక్ రిపబ్లిక్ ఆంక్షలు విధించింది. జర్మనీలో కరోనా మృతులు 1 లక్ష దాటాయి.
ఫారెన్ పోర్ట్పోలియో ఇన్వెస్టర్స్(FPIs) విక్రయాలకు మొగ్గు చూపుతున్నారు. ఇవన్నీ మార్కెట్ సెంటిమెంటును బలహీనపరిచాయి.


Click it and Unblock the Notifications