రూ.11,000కు పైగా బెనిఫిట్: ప్రభుత్వ ఉద్యోగులకు మారుతీ సుజుకీ అదిరిపోయే ఆఫర్లు
ప్రముఖ కార్ మేకర్ మారుతీ సుజుకీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. రూ.11,000 అంతకంటే ఎక్కువ ప్రయోజనంతో కూడిన పండుగ ఆఫర్లు ప్రకటించింది. దసరా, దీపావళి పండుగ సీజన్లో దాదాపు అన్ని వ్యాపార సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. గత ఆరు నెలలుగా కరోనా కారణంగా సేల్స్ పడిపోయాయి. దీంతో విక్రయాలు పెంచుకోవడానికి కూడా ఈ ఆఫర్లు దోహదపడతాయని భావిస్తున్నారు. ఇందులో భాగంగా మారుతీ సుజుకీ అన్ని మోడల్స్ పైన ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫర్లు ప్రకటించింది.
వీరికి ప్రయోజనాలు
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల లీవ్ ట్రావెల్ కన్సెషన్(LTC) క్యాష్ వోచర్ స్కీంను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. ఈ స్కీం కింద 12 శాతానికి పైగా జీఎస్టీ ఉన్న ఉత్పత్తులను ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేయాలి. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫర్ ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పని చేసే ఉద్యోగులు, పోలీసు, పారామిలిటరీ సిబ్బంది కొత్త కారు కొనుగోలు చేసే సమయంలో ఈ ప్రయోజనాలు ఉంటాయని మారుతీ సుజుకీ తెలిపింది.
ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెంచేందుకు..
ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల పలు చర్యలు చేపట్టిందని, తమవంతు బాధ్యతగా వీటిని అందిస్తున్నామని మారుతీ సుజుకీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెట్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కోటి మంది వరకు పని చేస్తున్నారని, వారిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని, దీంతో వారు తమకు ఇష్టమైన కార్లను మంచి ఆఫర్తో కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన LTC ఎన్క్యాష్మెంట్ బెనిఫిట్కు అదనంగా ఈ సదుపాయం ఉంటుందని తెలిపారు.
అన్ని మోడళ్లపై స్కీం..
ప్రభుత్వం ప్రకటించిన LTC క్యాష్ వోచర్ స్కీంతో దాదాపు 45 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారని మారుతీ సుజుకీ తెలిపింది. ఈ పథకం వల్ల 2021 మార్చి 31 నాటికి అదనంగా రూ.28 వేల కోట్ల మేర డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఆల్టో, సెలెరియో, ఎస్ ప్రెస్సో, వ్యాగన్ ఆర్, ఈకో, స్విఫ్ట్, ఇగ్నిస్, డిజైర్, విటారా బ్రెజ్జా, బాలెనో, ఎస్ క్రాస్, ఎర్టిగా తదితర మోడల్స్ పైన ఈ స్కీం వర్తిస్తుందని తెలిపింది.