మారుతీ సుజుకీ సేల్స్ పెరిగాయి కానీ... గ్రామాల్లో సూపర్, పట్టణాల్లో అనిశ్చితి
మారుతీ సుజుకీ సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలను గురువారం (అక్టోబర్ 29) ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన కేవలం 0.95 శాతం వృద్ధితో నికర లాభం రూ.1,371.60 కోట్లు నమోదు చేసింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి రూ.1500 కోట్లు దాటుతుందని నిపుణులు అంచనా వేయగా, దానిని తాకలేకపోయింది. భారత అతిపెద్ద కార్ మేకర్ అయిన ఈ కంపెనీ గత ఏడాది ఇదే కాలంలో రూ.1358.60 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
బిగ్ బాస్కెట్లో మెజార్టీ వాటా... సూపర్ యాప్ తర్వాత టాటా గ్రూప్ మరో కీలక అడుగు!
సేల్స్ పెరిగాయి.. కానీ
కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 10.35 శాతం పెరిగి రూ.18,744 కోట్లుగా నమోదయింది. సెప్టెంబర్ త్రైమాసికంలో మారుతీ సుజుకీ 3,93,130 వాహనాలు విక్రయించింది. ఏడాది ప్రాతిపదికన 16.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 71.70 శాతం లాభపడి ఏడాది ప్రాతిపదికన రూ.1,167.70 కోట్లుగా ఉంది. అంతకుముందు త్రైమాసికం కంటే సెప్టెంబర్ త్రైమాసికంలో సేల్స్ కాస్త పుంజుకున్నాయని మారుతీ సుజుకీ తెలిపింది. లాక్ డౌన్ సడలింపులు, పండుగ సీజన్ నేపథ్యంలో సేల్స్ కాస్త పుంజుకున్నట్లు తెలిపారు. కంపెనీ ఫలితాల నేపథ్యంలో మారుతీ సుజుకీ స్టాక్స్ 1.42 శాతం క్షీణించి రూ.7,084 వద్ద ముగిసింది.
గ్రామీణం సూపర్.. డైలమాలో పట్టణ సేల్స్
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ప్రజారవాణా కంటే వ్యక్తిగత వాహనాల కోసం ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి పండుగ సీజన్, ఆఫర్లు కలిసి వచ్చాయి. దీంతో సెప్టెంబర్ త్రైమాసికంలో వాహనాలు పెరిగినట్లుగా భావిస్తున్నారు. గ్రామీణ విభాగంలో సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయని, కానీ పట్టణ మార్కెట్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. కరోనా ఆందోళనకర పరిస్థితుల్లో పట్టణ ప్రాంతంలో ఆదాయ పరిస్థితులు ఎలా ఉంటాయోనని అభిప్రాయపడ్డారు. డిమాండ్ ఇంకా అస్థిరంగానే కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
రెండు దశాబ్దాల్లో తొలిసారి భారీ నష్టం
మే నెల నుండి లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో మారుతీ వాహనాల సేల్స్ క్రమంగా పెరిగాయని తెలిపారు. ముఖ్యంగా ఎంట్రీలెవల్ హ్యాచ్ బ్యాక్ కేటగిరీకి గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ వేగంగా పెరిగిందన్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా జూన్ త్రైమాసికంలో మారుతీ సుజుకీ రూ.249.9 కోట్ల నష్టాలను నమోదు చేసింది. రెండు దశాబ్దాల్లో తొలిసారి ఈ నష్టాలను చూసింది.