హైదరాబాద్లోను మారుతీ సుజుకీ బంపరాఫర్: కారు కొనకుండానే.. నెలకు రూ.15,000
దేశీయ ప్రముఖ కార్ మేకర్ మారుతీ సుజుకీ వాహన సబ్స్క్రిప్షన్ ప్రోగ్రాంను మరో రెండు నగరాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ఈ స్కీం దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు హైదరాబాద్, పుణే నగరాలకు విస్తరించింది. ఈ స్కీంలో కారును నేరుగా కొనుగోలు చేయకుండానే ఉపయోగించుకోవచ్చు. ప్రతి నెల నిర్వహణ ఛార్జీల కింద కొంత మొత్తం చెల్లించవలసి ఉంటుంది. ఈ స్కీం అమలు కోసం జపాన్ ఒరిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
రూ.11,000కు పైగా బెనిఫిట్: ప్రభుత్వ ఉద్యోగులకు మారుతీ సుజుకీ అదిరిపోయే ఆఫర్లు
హైదరాబాద్ సహా నాలుగు నగరాలకు
మారుతీ సుజుకీ సబ్స్క్రిప్షన్ స్కీం మూడు నెలల క్రితం ప్రారంభమైంది. ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు నగరాల్లో తొలుత ప్రారంభించింది. ఇప్పుడు మరో రెండు నగరాలకు విస్తరించడం ద్వారా మొత్తం 4 నగరాలకు విస్తరించింది. కొత్త బ్రాండ్ కారును కొనుగోలు చేయకుండానే నెలవారీ ఎక్స్క్లూజివ్ ఫీజును చెల్లించి ఉపయోగించుకోవచ్చు. నెలవారీ కొంతమొత్తం చెల్లిస్తే మిగతా అంశాలు కంపెనీయే చూసుకుంటుంది.
ఈ కార్లపై స్కీం
ప్రతి నెల కొంత మొత్తం చెల్లిస్తే, కారు నిర్వహణ, ఇన్సురెన్స్, రోడ్ సైడ్ అసిస్ట్ వంటివి కంపెనీ చూసుకుంటుంది. వీటితో కలిపి నెలవారీ మొత్తాన్ని వసూలు చేస్తుంది. స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, బాలెనో, సియాజ్, XL6 తదితర కారు మోడల్స్ పైన ఈ స్కీం అందుబాటులో ఉంది.
హైదరాబాద్లో కనిష్ట ధర
మారుతీ సుజకీ ఈ కార్ల ఆఫర్లను 24 నెలలు, 36 నెలలు, 48 నెలల కాలానికి అందిస్తోంది. ఈ సబ్స్క్రిప్షన్ కనిష్ట స్కీం ధర స్విఫ్ట్ LXi పైన ఉంది. ఈ కారు నెలవారీ సబ్స్క్రిప్షన్ ధర హైదరాబాద్లో రూ.15,479, పుణేలో రూ.15,354 ఉంది. రానున్న రెండు మూడేళ్లలో దేశవ్యాప్తంగా 40 నుండి 60 పట్టణాల్లో దీనిని అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మంచి స్పందన
ఈ కారును కస్టమర్ పేరుపై రిజిస్టర్ చేస్తారు. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సురెన్స్ కలిపి ఛార్జీ వసూలు చేస్తారు. ప్యాకేజీలో భాగంగా మెయింటెనెన్స్, 24X7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉంది. ఇండివిడ్యువల్ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా దీనిని తీసుకు వచ్చారు. కస్టమర్ అనుకూల కాలపరిమితి, జీరో డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్ ఉంటాయి. ఈ స్కీంకు సంబంధించి కస్టమర్ల నుండి మంచి స్పందన వచ్చినట్లు కంపెనీ తెలిపింది.