లాభాలు తగ్గాయి, ఎలక్ట్రిక్ వాహనాలపై మారుతీ సుజుకీ కీలక వ్యాఖ్యలు
సెప్టెంబర్ త్రైమాసికంలో దిగ్గజ వాహన కంపెనీ మారుతీ సుజుకీ లాభం 65 శాతం మేర తగ్గింది. ఇప్పటికీ 2 లక్షల వాహనాల ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి. నెట్ సేల్స్ 9 శాతం పెరిగాయి. మారుతీ సుజుకీ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.487 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసికం లాభం రూ.1420 కోట్లతో పోలిస్తే ఇది 66 శాతం తక్కువ. చిప్స్ కొరతతో పాటు కమోడిటీ ధరలు పెరగడం వల్ల లాభం తగ్గినట్లు తెలిపింది. కార్యకలాపాల ఏకీకృత ఆధాయం రూ.18,756 కోట్ల నుండి రూ.20,551 కోట్లకు చేరుకుంది.
మొత్తం వాహన విక్రయాలు 3,93,130 నుండి 3,79,541కు తగ్గాయి. దేశీయ విక్రయాలు 3,70,619 నుండి 3,20,133కు క్షీణించాయి. కంపెనీ చరిత్రలో అత్యధికంగా ఓ త్రైమాసికంలో 59,408 వాహనాలు ఎగుమతి అయ్యాయి. ఏడాది క్రితం ఇది 22,511గా ఉంది. ఎలక్ట్రానిక్ చిప్స్ కొరతతో సమీక్ష త్రైమాసికంలో 1.16 లక్షల వాహనాల ఉత్పత్తిని మారుతీ సుజుకీ తగ్గించింది. సెప్టెంబర్ చివరి నాటికి 2 లక్షలకు పైగా ఆర్డర్లు పెండింగులో ఉన్నాయి.
2025 తర్వాత విద్యుత్ వాహనాలను(ఎలక్ట్రానిక్ వెహికిల్స్) విడుదల చేస్తామని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. నెలకు కనీసం 10,000 విద్యుత్ వాహనాలను విక్రయించే పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఈ విభాగంలోకి అడుగులు వేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సీఎన్జీ మోడల్స్కు డిమాండ్ పెరిగిందని, వీటి ఉత్పత్తి పెంపుపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. నవంబర్ నెలలో వాహన ఉత్పత్తి పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.