భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 400 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉధయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 262.97 పాయింట్లు (0.64%) ఎగిసి 41,479.11 వద్ద, నిఫ్టీ 76.60 పాయింట్లు (0.63%) పెరిగి 12,184.50 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. 541 షేర్లు లాభాల్లో, 232 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 27 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.47 సమయానికి 409.71 (0.99%) పాయింట్లు ఎగిసి 41,625.85, నిఫ్టీ 107.80 (0.89%) పాయింట్లు ఎగిసి 12,215.70 వద్ద ఉంది.
టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఎస్బీఐ, ఎన్టీపీసీ, హీరో మోటో కార్ప్, మహీంద్రా అండ్ మహంద్రా, హిందూస్తాన్ యూనీలీవర్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఓఎన్జీసీ, ఐటీసీ, మారుతీ, నెస్ట్లే, కొటక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పేయింట్స్, భారతీ ఎయిర్ టెల్, అల్ట్రా సిమెంట్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంకులు మాత్రమే నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
డాలరుతో రూపాయి మారకం విలువ 71.18 వద్ద ఉంది. చైనాలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు తగ్గముఖం పట్టాయి. దీంతో ఆసియా, ప్రపంచ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆసియా మార్కెట్లు లాభపడుతుండటంతో ఈ ప్రభావం భారత మార్కెట్లపై కూడా చూపుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దాదాపు అన్ని రంగాల షేర్లు కూడా లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి.