సెన్సెక్స్ 917 పాయింట్లు అప్, భారీ లాభాల్లో మార్కెట్లు, కారణాలివే
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిసింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు దాదాపు 1000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, ఈ రోజు (ఫిబ్రవరి 4) ఏకంగా 917.07 (2.30%) పాయింట్ల లాభంతో 40,789.38 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 272 పాయింట్లు లాభపడి 11,979.65 వద్ద క్లోజ్ అయింది. ఈ ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షలకు పైగా పెరిగింది. దీంతో మార్కెట్ సంపద రూ.156 లక్షల కోట్లను దాటింది. చాలా వరకు స్టాక్స్ 52 వారాల గరిష్టస్థాయిని తాకాయి.
మార్కెట్లు లాభాల్లో ముగియడానికి ప్రపంచ మార్కెట్లు, బడ్జెట్ భయాలు తొలగడం, భారీగా కొనుగోళ్లు, చమురు ధరలు ప్రభావం వంటి వివిధ కారణాలు ఉన్నాయి. నిన్న కుంగిన చైనా, ఆసియా మార్కెట్లు మళ్లీ కోలుకున్నాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై కూడా పడింది. జపాన్ మార్కెట్లు ఈ రోజు 1 శాతం మేర లాభపడ్డాయి. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా మార్కెట్లు కూడా లాభపడ్డాయి.
అలాగే, శనివారం నాటి బడ్జెట్ భయాలు మెల్లిమెల్లిగా తొలగిపోయాయి. బడ్జెట్లో వ్యతిరేక నిర్ణయాలు లేవని గ్రహించడంతో మార్కెట్ మళ్లీ పుంజుకుంది. చైనాలో చమురు డిమాండ్ తగ్గడంతో ధరలు కుంగిపోయాయి. దాదాపు 13 నెలల కనిష్టానికి చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ ధర 1.82 డాలర్లు తగ్గి 54.80 డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతి సంస్థ సైనోపెక్ కార్ప రోజుకు 6,00,000 బ్యారెల్స్ చమురు కనుగొళ్లను తగ్గించుకోవాలని వార్తలు రావడంతో ధరలు పడిపోయాయి. ఇధి 12 శాతం ఉత్పత్తికి సమానం. గత పదేళ్లలో ఇదే అత్యల్ప చమురు దిగుమతి.
ఉదయం మార్కెట్ ప్రారంభం...
స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 298.45 పాయింట్ల (0.75%) లాభంతో 40,170.76 వద్ద, నిఫ్టీ 90.10 పాయింట్ల (0.77%) లాభంతో 11,798 వద్ద ట్రేడ్ అయింది. 595 షేర్లు లాభాల్లో, 142 షేర్లు నష్టాల్లో ఉండగా, 20 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఉదయం గం.10.48 సమయానికి సెన్సెక్స్ 615.17 (1.54%) పాయింట్లు లాభపడి 40,487.48 వద్ద, నిఫ్టీ 175.65 (1.50%) పాయింట్లు లాభపడి 11,883.55 వద్ద ట్రేడ్ అయింది.
బడ్జెట్ నేపథ్యంలో శనివారం వెయ్యి పాయింట్లకు పైగా సెన్సెక్స్, దాదాపు 400 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయింది. సోమవారం స్వల్ప ఉపశమనం లభించింది. మంగళవారం మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. డాలరు మారకంతో రూపాయి 19 పైసలు పెరిగి 71.19 వద్ద ఉంది. రంగాలవారీగా చూస్తే ఐటీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. బ్యాంకింగ్ రంగం, ఆటో రంగం షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి.