కరోనా ఎఫెక్ట్: మార్కెట్లకు భారీ దెబ్బ, 40వేల దిగువకు సెన్సెక్స్, రూ.6 లక్షల కోట్లు ఆవిరి
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. చైనాలో వేలాదిమందిని బలితీసుకున్న కరోనా వైరస్ ప్రాన్స్, ఇరాన్, సౌత్ కొరియా, ఇటలీ దేశాలకు వ్యాప్తి చెందింది. దీంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై పడింది. బుధవారం సెన్సెక్స్ 40,000 పాయింట్లకు దిగువకు చేరుకుంది. 39,889 వద్ద ముగిసింది. నేడు (గురువారం 27, ఫిబ్రవరి) కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
రూ.2,000 కథ ముగిసినట్లే? ATMలో క్యాసెట్ తొలగింత, బ్యాంకుల ప్రకటన!
40వేల లోపు సెన్సెక్స్, 12వేల లోపు నిఫ్టీ
ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 134.41 పాయింట్లు (0.34%) దిగజారి 39,754.55 వద్ద, నిఫ్టీ 39.50 పాయింట్లు (0.34%) తగ్గి 11,639 వద్ద ఉంది. 326 షేర్లు లాభాల్లో, 297 షేర్లు నష్టాల్లో ఉండగా, 48 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 364.24 (0.91%) పాయింట్లు నష్టపోయి 39,524.72 వద్ద, నిఫ్టీ 110.55 (0.95%) పాయింట్లు దిగజారి 11,567.95 వద్ద ఉంది. కరోనా సహా వివిధ కారణాలతో సెన్సెక్స్ 40వేల మార్క్ కంటే దిగజారింది. నిఫ్టీ 12వేల లోపు వచ్చింది.
కరోనా ప్రభావంతో కుప్పకూలుతున్న మార్కెట్లు
కరోనా వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందనే సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ వారంలో మార్కెట్లు నష్టాల్లోనే ఉన్నాయి.
నాలుగు సెషన్లలో రూ.6 లక్షల కోట్లు హాంఫట్
గత నాలుగు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్లు హరించుకుపోయింది. బీఎస్ఈలో లిస్టైన కార్పొరేట్ సంస్థల మార్కెట్ విలువ భారీగా పడిపోతోంది. కరోనా వైరస్ ఇతర పొరుగు దేశాలకు పాకుతుండటంతో విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో మంగళవారం ఒకేరోజు దేశీయ ఈక్విటీ, డెబిట్ మార్కెట్ల నుంచి రూ.2,315 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. గత ఐదు నెలలుగా వరుసగా పెట్టుబడులు పెట్టిన FPIలు ఫిబ్రవరి ప్రారంభంలోను రూ.21వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు. కానీ కరోనా వైరస్ వల్ల మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నది.