సెన్సెక్స్ 300 పాయింట్లు డౌన్, ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే
స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 11) భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ గతవారం 59,447 పాయింట్ల వద్ద ముగియగా, నేడు 59,333 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఓ సమయంలో దాదాపు 500 పాయింట్లు క్షీణించి 59,000 మార్కు దిగువకు పడిపోయింది. నిఫ్టీ 17,750 పాయింట్ల దిగువకు పడిపోయింది. నేడు టీసీఎస్, బుధవారం ఇన్ఫోసిస్ ఫలితాలు ఉన్నాయి. ఫలితాలకు ముంద ఐటీ స్టాక్స్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నాయి. పవర్ రంగం మాత్రం లాభాల్లో ఉంది. రుచి సోయా, అదానీ గ్రీన్ ఏడు శాతం మేర లాభపడింది.
టాప్ 30లో...
ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా బ్యాకు, HDFC బ్యాంకు, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, HDFC భారీ నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, గ్రాసీమ్ ఇండస్ట్రీస్, సిప్లా, ఎన్టీపీసీ మాత్రం లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్లో 12 స్టాక్స్ లాభాల్లో ఉండగా, 18 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఐటీలో టీసీఎస్ మాత్రమే లాభాల్లో ఉంది. రుచి సోయా బోర్డు కంపెనీ పేరును పతంజలి ఫుడ్స్ కిందకు మార్చడానికి అంగీకారం తెలిపింది. ఇక డాలర్ మారకంతో రూపాయి 10 పైసలు ఎగబాకి 75.93 వద్ద ట్రేడ్ అయింది.
చమురు ధర తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నేటి ప్రారంభ సెషన్లో స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ 1.5 డాలర్లు క్షీణించి 101.27 డాలర్లు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 1.5 శాతం క్షీణించి 96.78 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రూడ్ ధరలు వరుసగా మూడో వారం తగ్గుదలతో ప్రారంభమయ్యాయి. మార్చి నెలలో చమురు ధరలు 5 శాతం మేర క్షీణించాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బిక్ టెక్ స్టాక్స్ మార్కెట్ నష్టాలకు ప్రధాన కారణమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్ కూడా
ఉదయం గం.10.00 సమయానికి సెన్సెక్స్ 387 పాయింట్లు నష్టపోయి 59,060 పాయింట్ల వద్ద, నిఫ్టీ 97 పాయింట్లు క్షీణించి 17,687 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. 500 పాయింట్ల నష్టం నుండి క్రమంగా 300 పాయింట్ల నష్టం వద్ద కనిపిస్తోంది. నేడు అమెరికా మార్కెట్లు నష్టాల్లో ఉండగా, యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. జపాన్ నిక్కీ, భారత్ నిఫ్టీ, సింగపూర్ స్ట్రేయిట్ టైమ్స్, హాంగ షెంగ్, తైవాన్ వెయిటెడ్, కోస్పి, సెట్ కాంపోజిట్, షాంఘై కాంపోజిట్ 0.5 నుండి 2.45 శాతం మేర క్షీణించాయి. ఒక్క జకర్తా కాంపోజిట్ మాత్రమే లాభాల్లో ఉంది.