700 పాయింట్లు పతనమై, 450 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్: లాభాల్లో మార్కెట్ అందుకే
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లి, ఆ తర్వాత పరుగులు పెట్టాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావంతో గతవారం సూచీలు భారీగా నష్టపోయాయి. క్రితం సెషన్లో సెన్సెక్స్ ఏకంగా 1600 పాయింట్లకు పైగా నష్టపోయింది. మొత్తంగా గతవారం 2500 పాయింట్లకు పైగా క్షీణించింది. ఒమిక్రాన్ ప్రభావం మార్కెట్లపై నేడు కూడా కనిపించింది. అయితే ఇది కేవలం ఉదయానికే పరిమితమైంది. ఉదయం ఓ సమయంలో 100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11 తర్వాత భారీ లాభాల్లోకి వచ్చాయి. నష్టం కాసేప మాత్రమే కనిపించింది. ఆ తర్వాత అంతకంతకూ లాభపడింది.
ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా దారిలో రిలయన్స్ జియో టారిఫ్ పెంపు, ప్రయివేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై ఆర్బీఐ సానుకూల ప్రతిపాదనలు, ముడి చమురు ధరలు తగ్గడం, వివిధ దేశాల కరెన్సీలు కోలుకోవడం వంటి పరిణామాలు సూచీలకు కలిసి వ చ్చినట్లుగా కనిపించాయి. తొలుత ఒమిక్రాన్ భయాలు కనిపించినప్పటికీ, పై అంశాలు ఒమిక్రాన్ భయాలను అధిగమించాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొవిడ్ కొత్త వేరియంట్ క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఏ దేశానికి ఆ దేశం కట్టడి చర్యలు తీసుకోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది.
సెన్సెక్స్ మధ్యాహ్నం గం.2 సమయానికి 469.04 (0.82%) పాయింట్లు లాభపడి 57,561.66 పాయింట్ల వద్ద, నిఫ్టీ 122.15 (0.72%) పాయింట్లు ఎగిసి 17,148.60 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ నేడు 57,028.04 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,616.67 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,382.93 పాయింట్లవద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,055.80 పాయింట్ల వద్ద ప్రారంభమై 17,160.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,782.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నేడు ఓ సమయంలో 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత 400 పాయింట్లకు పైగా లాభపడింది. మధ్యాహ్నం వరకు దాదాపు 1300 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది.