కేంద్రం ఎఫెక్ట్: లాభాల్లో మార్కెట్లు, రూ.40,000 మార్క్ దాటిన సెన్సెక్స్
ముంబై: దీపావళి పండుగ తర్వాత మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మంగళవారం కొనసాగిన మార్కెట్ జోరు బుధవారం కూడా కనిపించింది. సెన్సెక్స్ 40,000 మార్క్ దాటింది. మధ్యాహ్నం గం.12.46 నిమిషాలకు సెన్సెక్స్ 40,064 పాయింట్ల వద్ద ఉంది. కార్పోరేట్ పన్ను తగ్గింపు అనంతరం కేంద్రం మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంటుందనే సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను పెంచాయి. దీంతో మార్కెట్లు దూకుడు పెంచుతున్నాయి.
మధ్యాహ్నం గం.12.46 నిమిషాలకు సెన్సెక్స్ 236.87 (0.59%) లాభపడి 40,068.71 మార్కు చేరుకుంది. నిఫ్టీ గం.12.49 సమయానికి 55.50 (0.47%) పాయింట్లు ఎగిసి 11,842.35 వద్ద ట్రేడ్ అయింది. జూలై నెల తర్వాత సెన్సెక్స్ 40,000 మార్క్ దాటడం ఇదే తొలిసారి. త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండటం, చైనాతో తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నామని ట్రంప్ చెప్పడం వంటి కారణాలు కూడా మార్కెట్కు ఊతమిచ్చాయి.
దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (LTCG), స్వల్పకాల మూలధన లాభాల పన్ను (STCG), డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (DDT)ని తగ్గించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని వార్తలు రావడం మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాడనికి కారణమయ్యాయి.
రాజు గారి తోటలో మహేష్ బాబు సతీమణి నమ్రత, సూపర్ రెస్పాన్స్
టాప్ గెయినర్స్ లిస్టులో ఐటీసీ, ఎస్బీఐ, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, హిండాల్కో ఉన్నాయి. టాప్ లూజర్స్ లిస్టులో బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, యూపీఎల్, కోల్ ఇండియా ఉన్నాయి.
మంగళవారం కూడా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ ముగిశాయి. కేంద్రం మరోసారి ఉద్దీపన పథకాలు ప్రకటించనుందనే వార్తలు నిన్న కూడా ఇన్వెస్టర్లను కొనుగోళ్లు జరిపేలా చేసాయి. సంవత్ 2076 తొలి సెషన్ ప్రారంభంలో లాభాలబాటపట్టిన 30 షేర్ల ఇండెక్స్ సెన్సెక్స్ ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మంగళవారం ఓ దశలో 666 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ చివరకు 581.64 పాయింట్లు లేదా 1.48 శాతం లాభంతో క్లోజ్ అయింది. దీంతో మార్కెట్ నాలుగు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా 159.70 పాయింట్లు లేదా 1.37 శాతం ఎగిసి 11,786.85 వద్ద స్థిరపడింది.