ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు: 10 శాతం తగ్గిన యస్ బ్యాంక్ షేర్
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. డిసెంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్భణం పెరిగిన నేపథ్యంలో సూచీలు నేలచూపులు చూశాయి. ఉదయం గం.9.17 నిమిషాలకు సెన్సెక్స్ 84 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 70.70 వద్ద ప్రారంభమైంది.
రెండు రోజుల్లో అమెరికా - చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనుంది. ఈ నేపథ్యంలో చైనాపై వేసిన కరెన్సీ మ్యానిపులేటర్ ముద్రను అమెరికా తొలగించడం వంట అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆసియా మార్కెట్లలో సూచీలు బలంగా కదలాడుతున్నా, దేశీయ సూచీల్లో ఉదయం ఊగిసలాట కనిపించింది.
మధ్యాహ్నం గం.2.41 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 16.39 (0.039%) పాయింట్లు లాభపడి 41,876.08 వద్ద, నిఫ్టీ 11.85 (0.096%) పాయింట్లు లాభపడి 12,341.40 వద్ద ట్రేడ్ అయింది. యస్ బ్యాంకు షేర్లు పది శాతం తగ్గాయి. ఐడియా, టాటా గ్లోబల్, సెయిల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, వేదాంత, టీవీ 18, గెయిల్, జిందాల్ స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఫార్మా, ఐటీ, ఎప్ఎంసీజీ, ఆటో షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.