బడ్జెట్ తర్వాత.. : నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై: కరోనా వైరస్ ప్రభావంతో అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. చైనీస్ మార్కెట్లు 9 శాతం మేర నష్టపోయాయి. కరోనాతో పాటు బడ్జెట్ ఆశించిన మేర లేకపోవడంతో భారత మార్కెట్లు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 09:17 సమయానికి సెన్సెక్స్ 89.46 (0.23%) పాయింట్లు నష్టపోయి 39,646.07 వద్ద, నిఫ్టీ 17.20 (0.15%) పాయింట్లు నష్టపోయి 11,644.70 వద్ద ప్రారంభమైంది. 354 షేర్లు లాభాల్లో, 352 షేర్లు నష్టాల్లో ఉండగా 43 షేర్లలో మార్పులేదు. IOC, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, HUL, BPCL, LIC హౌసింగ్ ఫైనాన్స్ లాభాల్లో ట్రేడ్ కాగా, ITC, HDFC, పవర్ గ్రిడ్, రిలయన్స్ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. టాటా మోటార్స్ షేర్లు 2% నష్టంతో ప్రారంభమయ్యాయి.
ఆటో, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఐటీ, మెటల్, ఫార్మా రంగాలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్ మందగమనం నుంచి ఆటో మొబైల్ కంపెనీలు మూడో త్రైమాసికంలో కోలుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఏజీఆర్పై నేడు విచారణ నేపథ్యంలో ఎయిర్టెల్ షేర్లు నష్టపోతున్నాయి. సిగరెట్ల ధరలు పెరుగనున్నందున ఐటీసీ నష్టపోతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.63 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది.
స్టాక్ మార్కెట్ గ్రాఫ్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన శనివారం నాడు భారీగా నష్టపోయింది. ఇలా దిగజారడం 11 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. పైగా అది బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టే రోజే కావడం మార్కెట్ వర్గాలను దిగ్భ్రాంతిలోకి ముంచెత్తింది. కొన్ని గంటల వ్యవధిలో సెన్సెక్స్ ఏకంగా 988 పాయింట్లను కోల్పోయింది. 40 వేల మార్క్కు దిగజారింది. నిఫ్టీ 11,700 మార్క్ సమీపంలో నిలిచిపోయింది.