భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, దెబ్బతీస్తున్న చైనా కరోనా వైరస్
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. ఉదయం గం.9.19 సమయంలో సెన్సెక్స్ 111 పాయింట్లు నష్టపోయి 41,030 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 12,065 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. మధ్యాహ్నం గం.11.21 సమయానికి సెన్సెక్స్ 267.02 (0.65%) పాయింట్లు నష్టపోయి 40,874.83 వద్ద, నిఫ్టీ 88.55 (0.73%) పాయింట్లు నష్టపోయి 12,009.60 వద్ద ట్రేడ్ అయింది.
చమురు స్టాక్స్ నష్టపోయాయి. మెటల్ స్టాక్స్ ఒత్తిడిలో ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. బంగారం మూడు రోజుల్లో మొదటిసారి విలువ కోల్పోయింది.
ఉదయం హిందూస్తాన్ యూనీలీవర్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఆటో, ఏషియన్ పేయింట్స్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, హీరో మోటో కార్ప్, మారుతీ, కొటక్ బ్యాంకు, నెస్ట్లే షేర్లు లాభాల్లో ట్రేడ్ కాగా, అల్ట్రా సిమెంట్, భారతీ ఎయిర్ టెల్, టైటాన్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, ఓఎన్జీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
కరోనా మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆసియా, పసిఫిక్ మార్కెట్లపై భారీ ప్రభావం పడుతోంది. మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. జపాన్ మార్కెట్లు నిక్కీ 0.8 శాతం, దక్షిణ కొరియాలో 1.4 శాతం నష్టపోయాయి. వాల్ స్ట్రీట్, డోజోన్స్ కూడా నష్టాల్లో ముగిశాయి.