ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు, అదరగొట్టిన డాక్టర్ రెడ్డీస్
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం(సెప్టెంబర్ 18) లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో టెన్షన్, ఫెడ్ రిజర్వ్ ప్రకటన ఆసియా, దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. అయితే నేడు మాత్రం స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. ఉదయం గం.9.19 సమయానికి సెన్సెక్స్ 162.45 పాయింట్లు(0.42 శాతం) ఎగిసి 39,142.30 వద్ద, నిఫ్టీ 62.90 పాయింట్లు(0.55 శాతం) లాభపడి 11,579 వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.11 సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్ల లాభాల్లో ఉంది.
దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఫార్మా రంగం ఏకంగా 2 శాతానికి పైగా లాభపడింది. ఆ తర్వాత ఆటో, బ్యాంకింగ్ రంగం మంచి లాభాల్లో ట్రేడ్ అవుతోంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు దాదాపు అర శాతం లాభపడ్డాయి. డాలర్ మారకంతో రూపాయి 18 పైసలు బలపడి 73.47 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సెషన్లో 73.65 వద్ద క్లోజ్ అయింది.
యుద్ధానికి సిద్ధం, రికవరీ పూర్తిగా లేదు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
టాప్ గెయినర్స్
ఉదయం పదిన్నర గంటల సమయానికి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, రిలయన్స్, సన్ ఫార్మా, హెచ్యూఎల్ ఉన్నాయి. మోస్ట్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, హిండాల్కో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హెచ్యూఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కొటక్ మహీంద్రా, బజాజ్ ఆటో ఉన్నాయి.నిన్న లిస్ట్ అయిన హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ షేర్ ధర ఈరోజు 2 శాతం మేర నష్టపోయింది. ఇష్యూ ధర కంటే 123 శాతానికి పైగా నిన్న లాభపడింది.
ఫార్మా దూకుడు
ఎన్ఎస్ఈలో అన్ని రంగాలు బలపడ్డాయి. ఫార్మా మూడు శాతానికి పైగా లాభపడింది. నిఫ్టీ ఫార్మా దిగ్గజాల్లో సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా 8-3 శాతం మేర లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ అయితే ఏకంగా 8 శాతానికి పైగా లాభపడింది. కరోనా వ్యాక్సీన్కు సంబంధించి వివిధ అగ్రిమెంట్ల నేపథ్యంలో షేర్ ధర జంప్ చేస్తోంది. హిండాల్కో, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, హీరో మోటో, టీసీఎస్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పేయింట్స్ 2-1 శాతం మేర లాభపడ్డాయి. హెచ్యూఎల్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ షేర్లు 1 శాతం నుండి 0.2 శాతం మేర క్షీణించాయి.
డాక్టర్ రెడ్డీస్ అదుర్స్
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంతకుముందు డాక్టర్ రెడ్డీస్ టార్గెట్ ధరను రూ.5,214గా పేర్కొంది. అయితే ఆ టార్గెట్ను డాక్టర్ రెడ్డీస్ దాటింది. ఉదయం గం.10.49 సమయానికి షేర్ ధర రూ.400కు (8 శాతానికి పైగా) పైగా పెరిగి రూ.5,230ని తాకింది. ఫెడరల్ బ్యాంకు టార్గెట్ ధరను రూ.70గా అంచనా వేసింది. అయితే ఈ రోజు ఈ బ్యాంకు షేర్ దాదాపు 1 శాతం మేర నష్టాల్లో ట్రేడ్ అవుతోంది.