4 రోజుల నష్టాలకు బ్రేక్, ఈ స్టాక్స్ మాత్రం 15 శాతం జంప్ చేశాయి
స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. గత సోమవారం లాభాల్లో ముగిసిన మార్కెట్లు, మంగళవారం నుండి శుక్రవారం వరకు వరుసగా నష్టపోయాయి. మళ్లీ నేడు(సోమవారం, అక్టోబర్ 25) లాభాల్లోకి వచ్చాయి. అయితే ఉదయం నష్టాల్లో కనిపించిన మార్కెట్లు, మధ్యాహ్నం గం.11 సమయానికి లాభాల్లోకి వచ్చాయి. ఆ తర్వాత ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఏ సమయంలోను నష్టాల్లోకి జారుకోలేదు. చివరకు 145 పాయింట్ల లాభంతో ముగిసింది సెన్సెక్స్. త్రైమాసిక ఫలితాలు ఆశించినస్థాయిలో లేకపోవడం, చైనాలో మళ్లీ కేసులు వెలుగులోకి వస్తుండడం, గరిష్ఠాల వద్ద ప్రాఫిట్ బుకింగ్, చమురు ధరల పెరుగుదల, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాల వంటి కారణాలు సూచీలను ఇంట్రాడేలో ఆందోళనకు గురి చేశాయి. అయితే, కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో పుంజుకొని లాభాలు నమోదు చేశాయి.
లాభాల్లో ముగింపు
సెన్సెక్స్ నేడు ఉదయం 61,398.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 61,404.99 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,449.68 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిప్టీ 18,229.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,241.40 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,968.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 145.43 (0.24%) పాయింట్లు లాభపడి 60,967.05 పాయింట్ల వద్ద, నిఫ్టీ 10.50 (0.058%) పాయింట్లు ఎగిసి 18,125.40 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ క్రితం సెషన్లో 60,821.62 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. అయితే నేడు దాదాపు వెయ్యి పాయింట్ల మధ్య పైకి, కిందకు కదలాడి, చివరకు 145 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 52 వారాల గరిష్టం పాయింట్లు, 52 వారాల కనిష్టం 39,241.87 పాయింట్లు.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ జాబితాలో ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, రిలయన్స్, SBI, టాటా మోటార్స్ ఉన్నాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ICICI బ్యాంకు 10.85 శాతం, Axis బ్యాంకు 3.48 శాతం, ONGC 2.77 శాతం, JSW స్టీల్ 0.97 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.83 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో BPCL 3.48 శాతం, SBI లైఫ్ ఇన్సురెన్స్ 3.21 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 3.06 శాతం, బజాజ్ ఆటో 2.66 శాతం, HCL టెక్ 2.40 శాతం నష్టపోయాయి.
బ్యాంకింగ్ రంగం మాత్రమే
నేడు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ రంగం మాత్రమే రాణించింది. మిగతా రంగాలు నష్టాల్లో ముగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, రియాల్టీ రంగాలు ఒక శాతం నుండి రెండు శాతం మేర క్షీణించాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కో శాతం చొప్పున పడిపోయాయి. అయితే పలు స్టాక్స్ 15 శాతం మేర లాభపడ్డాయి.
RTCL లిమిటెడ్ (20.0%), భారత్ అగ్రి ఫెర్ట్(19.98%), పానాసోనిక్ ఎనర్జీ(18.95%), VTM లిమిటెడ్(18.5%), బిందాల్ ఎక్స్పోర్ట్స్(17.65%) లాభపడ్డాయి