4 రోజుల నష్టానికి బ్రేక్, భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు: కారణాలివే
వరుసగా నాలుగు రోజుల నష్టానికి బ్రేక్ పడింది. స్టాక్ మార్కెట్ నేడు (మార్చి 8, మంగళవారం) రోజంతా ఊగిసలాటలో కనిపించినప్పటికీ చివరకి భారీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ క్రితం సెషన్లో 52,842 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు నష్టాల్లోనే ప్రారంభమై, ఆ తర్వాత లాభాల్లో కనిపించింది. కానీ అంతలోనే మళ్లీ నష్టాల్లోకి వెళ్లింది. చివరి గంటలో కోలుకొని, దాదాపు 600 పాయింట్ల లాభాల్లో ముగిసింది. అయినప్పటికీ ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లకు మరో దాదాపు 9000 పాయింట్ల దూరంలో ఉంది. కానీ నేడు 53,000 పాయింట్లను దాటి ఇన్వెస్టర్లకు కాస్త ఊరటనిచ్చింది.
కనిష్టం నుండి 1200 పాయింట్లు జంప్
సెన్సెక్స్ నేడు 52,430 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,484 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,260 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,747 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,028 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,671 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 518 పాయింట్లు లేదా 1.10 శాతం లాభపడి 53,424 పాయింట్ల వద్ద, నిఫ్టీ 150 పాయింట్లు లేదా 0.95 శాతం ఎగిసి 16,013 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేటి కనిష్టం నుండి 1200 పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ 16000 పాయింట్ల పైన ముగిసింది.
అందుకే లాభాల్లో..
స్టాక్ మార్కెట్ లాభాలకు వివిధ కారణాలు ఉన్నాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ భయాలు, చమురు పెరుగుదల ఆందోళన ఉన్నప్పటికీ కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు సూచీల పరుగుకు కారణమైంది. దీనికి తోడు నిన్నటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా సెంటిమెంటును కాస్త బలపరిచాయి. రియాల్టీ, ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల నుండి సూచీలకు మద్దతు లభించింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భారీ ఊగిసలాటలో కనిపించాయి. మధ్యాహ్నం గం.1.30 నుండి భారీ నష్టాల నుండి కోలుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత దాదాపు ఏ దశలోను కిందకు పడిపోలేదు. గం.2.30 సమయానికి లాభాల్లోకి వచ్చింది. అటు నుండి మరింత పరుగు పెట్టింది.
మార్కెట్ రికవరీకి బ్యాంకింగ్ స్టాక్స్ ప్రధాన కారణమయ్యాయి. రియాల్టీ, మీడియా, పీఎస్యూ బ్యాంకు, ఐటీ సూచీలకు కూడా కొనుగోళ్ల మద్దతు లభించింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఐవోసీ, సన్ ఫార్మా, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, టీసీఎస్, సిప్లా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో, ఓఎన్జీసీ, టాటా స్టీల్, బ్రిటానియా, జేఎస్డబ్ల్యు స్టీల్ ఉన్నాయి. ఇక, డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 76.91 వద్ద ముగిసింది. క్రితం సెషన్లో 76.96 వద్ద ముగిసింది. నేడు అతిస్వల్పంగా లాభపడింది.