నిన్నటి నష్టాలు నేడు రికవరీ, సెన్సెక్స్ 514 పాయింట్లు జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు రెండు రోజుల నష్టాల తర్వాత నేడు (సెప్టెంబర్ 21, మంగళవారం) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ నిన్న ఏ మేరకు నష్టపోయిందో దాదాపు అంతేస్థాయిలో నేడు ఎగిసిపడింది. మార్కెట్లు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఓ సమయంలో 250 పాయింట్ల మేర నష్టపోయింది సెన్సెక్స్. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని, కాసేపు ఊగిసలాటలో కనిపించింది. దాదాపు మధ్యాహ్నం ఒకటి నుండి లాభాల్లోకి వచ్చింది. ఇక ఏ సమయంలోను కిందకు పడిపోలేదు. అంతకంతకూ లాభపడింది. చివరకు 500 పాయింట్లకు పైగా సెన్సెక్స్ జంప్ చేసింది.
చైనా కంపెనీ ఎవర్ గ్రాండ్ సంక్షోభం సహా కరోనా భయాలు మార్కెట్లను ప్రారంభంలో కలవరపెట్టాయి. అందుకే మధ్యాహ్నం వరకు ఎక్కువగా ఊగిసలాటలో కనిపించాయి. చివరకు ఐరోపా మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్స్ నుండి సానుకూల సంకేతాలు అందుకున్న మార్కెట్లు ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.73.62 వద్ద ముగిసింది.
నిన్న కోల్పోయింది.. నేడు రాబట్టింది
సెన్సెక్స్ ఉదయం 58,630.06 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,084.51 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,232.54 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,450.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,578.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,326.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 514.34 (0.88%) పాయింట్లు నష్టపోయి 59,005.27 పాయింట్ల వద్ద, నిఫ్టీ 165.10 (0.95%) పాయింట్లు ఎగిసి 17,562.00 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్ ఇటీవల ఆల్ టైమ్ గరిష్టం 59,737 పాయింట్లను తాకింది. 60,000 పాయింట్ల సమీపానికి వెళ్లి, ప్రాఫిట్ బుకింగ్ కారణంగా వెనక్కి వచ్చింది. ఆల్ టైమ్ గరిష్టానికి మరో 730 పాయింట్ల దూరంలో ఉంది. కానీ నిన్న 525 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, నేడు దాదాపు అంతేస్థాయిలో 514 పాయింట్లు కోలుకుంది. నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టం 17,792 పాయింట్లకు మరో 230 పాయింట్ల దూరంలో ఉంది.
ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్
మార్కెట్లు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో వరుసగా రెండు రోజుల పాటు ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీనికి తోడు చైనాకు చెందిన ఎవర్ గ్రాండ్ ఆర్థిక సంక్షోభం నిన్న మార్కెట్లను కుదిపేసింది. నేడు ఆ ప్రభావం నుండి కాస్త బయటపడ్డాయి. సెన్సెక్స్ 30 షేర్లలో మెజార్టీ స్టాక్స్ లాభపడ్డాయి.
బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, HCL టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభపడ్డాయి. మారుతీ, బజాజ్ ఆటో, నెస్ట్లే, HDFC బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి. 30 స్టాక్స్లో ఆరు స్టాక్స్ మాత్రమే నష్టపోయాయి.
భారత వృద్ధి రేటు అంచనా
ఇదిలా ఉండగా, FY22లో భారత గ్రోత్ అంచనాను 9.7 శాతంగా అంచనా వేసింది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD). ప్రధాన ఆర్థిక వ్యవస్థలను పరిగణలోకి తీసుకుంటే కరోనా ప్రభావం భారత్ పైన భారీగానే పడిందని తెలిపింది. జూన్ త్రైమాసికంలో భారత్ రియల్ జీడీపీ కరోనా ముందుస్థాయి కంటే 15 శాతం తక్కువగా ఉందని అంచనా వేసింది. FY23లో భారత వృద్ధి రేటు అంచనా 7.9 శాతంగా అంచనా వేసింది.