భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 1534 పాయింట్లు జంప్
స్టాక్ మార్కెట్లు శుక్రవారం (మే 20) భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న నష్టపోయిన వాటి కంటే కాస్త ఎక్కువే నేడు లాభపడ్డాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత అంతకంతకూ ఎగిసిపడ్డాయి. రోజంతా అదే జోరును కొనసాగించాయి. దీంతో నిన్నటి నష్టాలు కవర్ అయ్యాయి. అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్ లాభాలు, ఆసియా మార్కెట్ సానుకూల కదలికలు జత కలిశాయి. దీనికి తోడు నిన్న భారీ నష్టాల నేపథ్యంలో కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోలుకు మొగ్గు చూపారు. రిలయన్స్ వంటి హెవీ వెయిట్స్ లాభాల్లో ముగియడం సూచీల పరుగుకు మరో కారణం.
సెన్సెక్స్ 1534 పాయింట్లు లేదా 2.91 శాతం ఎగిసి 54,326 పాయింట్ల వద్ద, నిఫ్టీ 456 పాయింట్లు ఎగిసి 16,266 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 53,513 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,396 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,403 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,043 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,283 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,003 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంకు, HDFC, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, HDFC బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు భారీగా లాభపడ్డాయి.