చివరి గంటన్నరలో...: భారీ లాభాల్లో ప్రారంభమై, నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఊగిసలాటలో కాసేపు కనిపించిన సూచీలు, ఆ తర్వాత భారీ లాభాల్లోకి వచ్చాయి. కానీ మధ్యాహ్నం గం.2 నుండి అంతకంతకూ పడిపోయింది. చివరకు స్వల్ప నష్టాల్లో ముగిసింది. మెటల్స్ మార్కెట్ నష్టాలకు కారణం కాగా, ఆటో రంగం ఎగిసిపడింది.
మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో చివరి గంటన్నరలో నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. మున్ముందు ఆర్బీఐ పరపతి సమీక్షలో వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం ఉండనుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంకేతాలిచ్చారు. ఇది ఆఖరులో మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది.
సెన్సెక్స్ ఉదయం 54,459.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,931.30 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,191.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,290.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,414.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,185.75 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 37 పాయింట్లు నష్టపోయి 54,288 పాయింట్ల వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు క్షీణించి 16,214 పాయింట్ల వద్ద ముగిసింది.