నష్టాల నుండి భారీ లాభాల్లోకి.. చివరకు స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు నేడు (సోమవారం, 29 నవంబర్) లాభాల్లో ముగిశాయి. గతవారం చివరలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనలతో సెన్సెక్స్ 2500 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఈ రోజు కూడా నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత కాసేపట్లోనే భారీ లాభాల్లోకి వచ్చింది. దేశీయంగా ఉన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్నాయి. దీర్ఘకాలలోను భారత మార్కెట్లపై ఇన్వెస్టర్లు బుల్లిష్గా ఉన్న నేపథ్యంలో సూచీలు నష్టాల నుండి లాభాల్లోకి వచ్చాయి. రిలయన్స్ టారిఫ్ పెంపు, ప్రయివేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై ఆర్బీఐ సానుకూల ప్రతిపాదనలు, ముడి చమురు ధరలు తగ్గడం వంటి పరిణామాలు సూచీలకు అండగా నిలిచాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది.
సెన్సెక్స్ 153.43 (0.27%) పాయింట్లు లాభపడి 57,260.58 పాయింట్ల వద్ద, నిఫ్టీ 27.50 (0.16%) పాయింట్లు లాభపడి 17,053.95 పాయింట్ల వద్ద ముగిసింది.. సెన్సెక్స్ 57,028.04 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,626.51 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,382.93 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,055.80 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,160.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,782.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.75.09 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో 18 షేర్లు లాభపడ్డాయి. కొటాక్ మహీంద్రా బ్యాంకు, HCL టెక్, టైటాన్, టీసీఎస్, బజాజ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, టెక్ మహీంద్రా, HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. అత్యధికంగా నష్టపోయిన వాటిలో సన్ ఫార్మా, NTPC, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, HDFC, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో షేర్లు ఉన్నాయి.