Stock market today: ఊగిసలాట నుండి లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. రోజంతా ఒడుదొడుకుల్లో కనిపించిన సూచీలు చివరకు బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ అండతో లాభాల్లోకి వచ్చాయి. కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 200 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఒక దశలో 54,585 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అయితే మధ్యాహ్నం తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపించడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి స్టాక్స్ దన్నుగా నిలిచాయి. దీంతో సూచీలు మళ్లీ కోలుకుని స్వల్ప లాభాలతో ముగిశాయి.
సెన్సెక్స్ 54,385.71 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,584.73 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,124.27 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,281.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,320.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,179.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 125.13 (0.23%) లాభపడి 54,402.85 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20.05 (0.12%) పాయింట్లు ఎగిసి 16,258.25 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా స్టీల్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, HDFC బ్యాంకు ఉన్నాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 2.20 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.98 శాతం, టెక్ మహీంద్రా 1.81 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.69 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.29 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 2.11 శాతం, కోల్ ఇండియా 1.95 శాతం, హిండాల్కో 1.68 శాతం, అదానీ పోర్ట్స్ 1.52 శాతం, భారతీ ఎయిర్టెల్ 1.42 శాతం నష్టపోయాయి.